ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకునేవారికి భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రివర్గం కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాల నిబంధనల్లో మరిన్ని సడలింపులకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతో 50 చ.మీ.విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు 1.5 మీటర్ల వెడల్పుతో బాల్కనీలు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్ల లో కూడా రెడ్ కేటగిరీ మినహా ఇతర పరిశ్రమలకు అనుమతి ఇస్తారు. చిన్న చిన్న ప్లాట్లలో ఉమ్మడిగా ఉండే చోట కొన్ని సడలింపులు చేశారు. 100 చ.మీటర్ల ప్లాట్ కు 2 మీ.వెడల్పు గల అంతర్గత రోడ్డు,100చ.మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుంది. 100 చ.మీ.లోపు ప్లాట్లకు ఆల్ రౌండ్ సెట్ బ్యాక్ లు అవసరం లేదు. 300 చ.మీ.కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్ కు అనుమతి ఇస్తారు.
ఇప్పటికే ప్లాన్ అప్రూవల్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇస్తున్నాయి. 300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్ లోడ్ చేసే అవకాశం ఉంది. నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలను సరళతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.