బీఆర్ఎస్లో ఆదరణ లేని నేతల్ని కవిత తెలంగాణ రక్షణ సేనలోకి కవిత బాగానే ఆకర్షిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిన నేతల్ని కూడా వెలుగులోకి తెస్తున్నారు. రోజుకొకర్ని పార్టీలో చేర్చుకుంటున్న కవిత ప్రస్తుతం పార్టీని రోజూ వార్తల్లో ఉండేలా చేస్తున్నారు. రాజకీయ పార్టీకి క్షేత్ర స్థాయిలో నాయకత్వం ముఖ్యం. ముందుగా ఆ నాయకత్వాన్ని బిల్డ్ చేసుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో నేతలకు కొదవలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో .. తెలంగాణ శక్తుల ఏకీకరణ పేరుతో ఆ పార్టీలో చేరిన నేతలు చాలా మంది గుర్తింపు లేకుండా ఉన్నారు. అలా రాజకీయంగా దాదాపు ఫేడ్ అవుట్ అయిన నేతలను మళ్ళీ వెలుగులోకి తెచ్చి రక్షణ సేన నాయకులుగా మార్చేందుకు ఆమె పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒకప్పుడు కీలకంగా ఉండి, ప్రస్తుతం ప్రాధాన్యత కోల్పోయిన నాయకులను నేరుగా కలిసి వారిని గులాబీ గూటికి చేర్చుకుంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుండటంతో, చాలా మంది నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కవిత రివర్స్ వ్యూహం అమలు చేస్తున్నారు. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన వారైనా, పాత పరిచయాలు ఉన్న నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. రోజుకో నాయకుడిని పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల పార్టీకి క్యాడర్ పరంగా బలం చేకూరడమే కాకుండా, బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది అన్న ప్రచారం చేయవచ్చనుకుంటున్నారు.
నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి, వారికి భవిష్యత్తులో సరైన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, క్షేత్రస్థాయిలో పట్టున్న ద్వితీయ శ్రేణి నాయకులను నిరంతరం కలుస్తున్నారు. ఆమె నివాసం ఇప్పుడు చేరికలతో కళకళలాడుతుండటం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
ఈ చేరికలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. ప్రభావం చూపలేని నేతలను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బలం లేని చోట చిన్న చిన్న శక్తులన్నీ కలిస్తేనే పెద్ద శక్తి అవుతుంది అనే సిద్ధాంతంతో కవిత ముందుకు సాగుతున్నారు. వరుస చేరికల ద్వారా పార్టీ ఉనికిని చాటుకోవచ్చని అనుకుంటున్నారు.
