ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ.బీ. వెంకటేశ్వరరావు వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తనపై జరిగిన వేధింపులకు పరిహారం కోరుతూ న్యాయపోరాటం చేస్తున్న ఆయన, మరోవైపు సొంతంగా రాజకీయ పార్టీ పెడతానంటూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీలో పిలిచి పెద్ద పీట వేయలేదనే ఆయన ఇలా చేస్తున్నారు. కానీ ఆయనను మరోసారి నెత్తి మీదపెట్టుకునేందుకు చంద్రబాబు, టీడీపీ సిద్ధంగా లేదు. దానికి కారణం ఆయన వల్ల ఓ సారి జరిగిన నష్టమే. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో జరిగిన వైఫల్యాలు, దానివల్ల తెలుగుదేశం పార్టీ అనుభవించిన చేదు ఫలితాలు చాలా ఎక్కువ.
ఇంటెలిజెన్స్ వైఫల్యమే 2019లో టీడీపీ ఓటమికి పునాది?
2019 ఎన్నికలకు ముందు ఏ.బీ. వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు టీడీపీకి కోలుకోలేని దెబ్బ తీశాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతంలో ఇంటెలిజెన్స్ విభాగం ఘోరంగా విఫలమైందనే విమర్శ ఇప్పటికీ ఉంది. అత్యంత కీలకమైన రాజకీయ సమాచారాన్ని సేకరించడంలో, విశ్లేషించడంలో ఏబీవీ విఫలమయ్యారు. హత్య జరిగిన తర్వాత కూడా దానిని గుండెపోటు గా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పుడు, వాస్తవాలను ముఖ్యమంత్రికి చేరవేయడంలో ఇంటెలిజెన్స్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అప్పట్లో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.
చంద్రబాబుకు తప్పుడు బ్రీఫింగ్ .. రాజకీయ నష్టం
అది హత్య అని ఉదయమే అందరికీ తెలిసిపోయింది. కానీ ఇంటలిజెన్స్ పోలీసులుక తెలియలేదు. ముఖ్యమంత్రికి కూడా గుండెపోటు అనే సమాచారం ఇచ్చారు. ఒక రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయిలో ఉండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పసిగట్టలేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు వైసీపీ దారుణమైన వ్యూహాలను అంచనా వేయలేకపోయారు. ది ప్రత్యర్థి పార్టీకి పెద్ద అస్త్రంగా మారి, చివరికి టీడీపీ ఓటమికి ఒక ప్రధాన కారణమైంది. ఏబీవీని ‘నెత్తిన పెట్టుకోవడం’ వల్లే ఆనాడు భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
పదవుల తిరస్కరణ.. హోదా పేరుతో అహంకారం?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏబీవీ పట్ల సానుకూలంగానే వ్యవహరించింది. ఆయనపై గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ తొలగించింది. గిన గౌరవం ఇవ్వడానికి టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఒక కీలక పదవిని కూడా ఇచ్చింది. తన స్థాయికి ఆ పదవి తక్కువని భావించిన ఏబీవీ, దానిని చేపట్టడానికి నిరాకరించారు. కష్టకాలంలో అండగా నిలిచిన పార్టీ పట్ల కృతజ్ఞత కంటే, తన వ్యక్తిగత హోదాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి టీడీపీ హైకమాండ్ కూడా పట్టించుకోవడంలేదు.
విక్టిమ్ కార్డ్ తో రాజకీయ చదరంగం
జగన్ ప్రభుత్వం తనను వేధించిందనే సాకుతో సానుభూతి పొందే ప్రయత్నం చేసిన ఏబీవీ, ఇప్పుడు అదే సానుభూతిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. సొంత పార్టీ పేరుతో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా రాజకీయాల్లో స్పేస్ సృష్టించుకోవాలని చూస్తున్నారు. తనకు అండగా నిలిచిన టీడీపీపైనే ఇప్పుడు తిరుగుబాటు ధోరణి ప్రదర్శించడం వెనుక ఆయన వ్యక్తిగత రాజకీయ ఆశయాలు కనిపిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏబీవీని అతిగా విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన చేసిన తెలివితక్కువ పనులు పార్టీని అధికారానికి దూరం చేశాయన్న సత్యాన్ని చంద్రబాబు ఆలస్యంగా గ్రహించారు. ఇప్పుడు ఏబీవీ సొంతంగా పార్టీ పెట్టినా, విమర్శలు చేసినా టీడీపీ లైట్ తీసుకుంటోంది. తప్పులు చేసి, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వైఫల్యం చెందిన ఒక అధికారిని రాజకీయంగా నెత్తిన పెట్టుకోవడానికి పార్టీ ఇక సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.
