అమరావతిలో మరో 44వేల ఎకరాలను భూసమీకరణలో భాగంగా సేకరించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే అమరావతి మొదటి దశ పూర్తి స్థాయిలో పట్టాలెక్కినందున మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు భూమి అవసరం అని నిర్ణయానికి వచ్చారు. సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో 2019కు ముందు ఆరేళ్ల అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. రాజధాని నిర్ణయించక ముందు ఎవరికి హక్కులు ఉన్నాయో వారికి పరిహారం చెల్లిస్తారు. దీని వల్ల ఆసైన్డ్ భూములు, ఇతర భూములు ఉన్నారు ఈ మధ్య కాలంలో అమ్ముకున్నా వారికే పరిహారం వస్తుంది.
2,500 ఎకరాలు కాలుష్య రహిత పరిశ్రమలకు, 5,000 ఎకరాలు విమానాశ్రయం కోసం, 2,500 ఎకరాలు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమని గతంలో మంత్రి నారాయణ చెప్పారు. పూలింగ్లో భాగంగా రైతులు తమ భూమిని ప్రభుత్వానికి అందజేస్తే, బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఆర్థిక పరిహారం అందిస్తారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 36,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చేందుకు రైతులు అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
భూసమీకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రైతులతో చర్చలు, గ్రామసభల ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతోంది.- అమరావతి నిర్మాణ పనులు 2028 నాటికి గణనీయమైన పురోగతి సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మొదటి దశ పూర్తి చేసిన తర్వాత రెండో దశ భూసమీకరణ చేస్తే మంచిదని కొంత మంది సలహాలు ఇస్తున్నారు. అయితే భూసమీకరణ ప్రక్రియ చివరికి వచ్చే సరికి అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో ఊపందుకుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.