తుని రైలు దహనం కేసులో ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. రైల్వే కోర్టు తీర్పును అప్పీల్ చేయాలని రాత్రి ఇచ్చిన ఆదేశాలను ఇరవై నాలుగు గంటల్లోనే వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఈ జీవో వచ్చిందని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఓ రైల్వే అధికారి చేసిన ప్రతిపాదనపైఈ ఉత్తర్వులు వచ్చాయని .. సున్నితమైన విషయాలపై యాంత్రికంగా స్పందించారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తుని రైలు దహనం కేసులో అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఆ రైలు మాత్రం దీనంగా అలా ఉండిపోయింది. రైలును తగులబెట్టిన వారు .. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసుల్ని కొట్టిన వారు, పోలీస్ స్టేషన్ పై విధ్వంసానికి పాల్పడిన వారు ఎవరూ శిక్షకు గురి కాలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు కోర్టు ముందు సాక్ష్యాలు పెట్టకుండా కేసును నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం అప్పీలు చేయడానికి ఇచ్చిన ఉత్తర్వులు కూడా వెనక్కి తీసుకుంది.
ముద్రగడ పద్మానాభం తప్ప కీలక నిందితులు అంతా కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఈ కారణంగానే అప్పీల్ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో ముగిసిపోయిన వివాదాన్ని మళ్లీ రేపడం ఎందుకని అనుకున్నారో కానీ.. ఆ జీవోను వెనక్కి తీసుకున్నారు. దీంతో తుని రైలు ఘటనం కేసులో నిందితులంతా హమ్మయ్య అనుకున్నారు.