ఈమధ్య మన హీరోలకు రక్త ప్రీతి ఎక్కువైంది. ఏ సినిమా చూసినా హింసా.. రక్తపాతమే. నాని లాంటి హీరో సినిమా చేసినా వెండి తెర రక్త సిక్తమవుతోంది. హిట్ 3 ట్రైలర్ ఎలా ఉందో చూశాం. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి యాక్షన్ హీరోల సంగతి ఇక చెప్పక్లర్లెదు. విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’లోనూ రక్తం ఏరులై పారబోతోంది. ఇప్పుడు చాక్లెట్ బోయ్ శర్వానంద్ కూడా ఈ జోనర్ కథే ఎంచుకొన్నాడు.
శర్వానంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భోగి’ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెబుతూ ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అది చూస్తే… శర్వా ఇది వరకెప్పుడూ చేయని యాక్షన్ డ్రామా చేయబోతున్నాడన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. సంపత్ నంది కూడా ముందు నుంచీ ఇదే చెబుతున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు వేరే రేంజ్లో ఉంటాయని ఊరిస్తూ వచ్చాడు. దానికి శాంపిల్ గా ఈ రోజు విడుదల చేసిన గ్లింప్స్ కనిపిస్తోంది.
వయెలెన్స్ కి ఈ జనరేషన్ అర్థాన్ని మార్చేశారు. దాన్ని కూడా ఓ కమర్షియల్ ఎలిమెంట్ గానే చూస్తున్నారు. ‘యానిమల్ ‘, ‘మార్కో’ లాంటి సినిమాల్లో హింస హద్దులు దాటింది. అయినా సరే, ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ‘హిట్ 3’, ‘పారడైజ్’, ‘కింగ్ డమ్’… ఇప్పుడు ‘భోగి’ కూడా అదే దారిలో వెళ్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న సినిమా ఇది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.