బీజేపీ నిత్య అసంతృప్త ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర నాయకత్వం నోటీసులు జారీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం ఉందన్న రాజాసింగ్..తనకు నోటీసులు ఇవ్వడం కాదు..అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ కవిత… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయని చెప్పారు. దీనిని సమర్థిస్తూ రాజాసింగ్ ఆ పార్టీ నేతల గురించి ఘాటుగానే స్పందించారు. కొంతమంది బీజేపీ నేతలు మంచి ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్ లో చేరుతారని వ్యాఖ్యానించారు. ఇది పార్టీలో పెను దుమారం రేపింది. దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని జాతీయ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
తనకు నోటీసులు ఇస్తారనే అంశంపై తాజాగా స్పందించిన రాజాసింగ్..నాకు నోటీసులు ఇస్తే పార్టీలో అందరి జాతకం బయటపెడుతానని ప్రకటించారు. ఎవరి వలన పార్టీకి నష్టం జరుగుతుందో అన్ని విషయాలను బహిరంగం చేస్తానని వ్యాఖ్యానించారు. తనకు నోటీసులు కాదు..సస్పెండ్ చేయాలన్నారు.