తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ రెండూ ఒకే రాజకీయ కూటమి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు. తెలుగు రాష్ర్టాలు రెండింటిలోనూ మిత్రపక్షాలు. తెలంగాణలో పరాజయాల్ని, ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని ఈ రెండు పార్టీలు కలసి పంచుకుంటున్నాయి. అక్కడ పంచుకుంటున్నది అధికారం గనుక.. ఎవ్వరికీ పెద్దగా ఎలాంటి మనస్తాపాలు ఉండకపోవచ్చు.. కానీ.. ఇక్కడ తెలంగాణ లో మాత్రం అధికారంలో లేని ఈ రెండు పార్టీల మధ్య మైత్రి మరీ ఘోరంగా తయారైపోయింది. ఒకరిని ఒకరు దారుణంగా నిందించుకునే పరిస్థితి. తాజాగా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడం.. భవిష్యత్లో వీరి బంధం పుటుక్కుమంటుందనడానికి సంకేతాల్లాగా ఉన్నది.
‘స్థానిక నాయకత్వం నిర్ణయం మేరకు’ అనే మిషమీద ఈ రెండు చోట్ల రెండు పార్టీలూ విడివిడిగా అన్ని స్థానాలకూ బరిలోకి అభ్యర్థుల్ని దింపాయి. అంతవరకు మంచిదే. కానీ.. వారి వైఖరిలోనూ మిత్రపక్షాలు పోటీచేస్తున్న వాతావరణం కనిపించడం లేదు. బద్ధ శత్రువులు తలపడగట్లుగానే కనిపిస్తోంది. భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి అయితే.. కాంగ్రెస్ తెదేపాలకు ఓటు వేస్తే మురిగిపోతుందని.. ఎందుకంటే.. గెలిచిన వాళ్లు వెళ్లి మళ్లీ తెరాసలో చేరుతారని వరంగల్ ఎద్దేవా చేయడం మరీ ఘోరం. ఎందుకంటే.. అసలే పార్టీ ఖాళీ అవుతున్న బాధలో ఉన్న తెదేపాకు ఇలా మిత్రుల వెటకారం మరింత బాధ కలిగిస్తుంది. ‘మొగుడు కొట్టినందుకు కాదుగానీ.. తోడికోడలు నవ్వినందుకు ఏడ్చానన్న’ సామెత చందంగా తెదేపా వారి పరిస్థితి తయారౌతుంది.
అయితే తెలుగుదేశాన్ని నమ్ముకునే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దెబ్బతిన్నాం అని.. వారి జత లేకపోతే మరిన్ని సీట్లు వచ్చేవని భాజపా ఏమైనా భ్రమల్లో ఉన్నదేమో తెలియదు. ఖమ్మంలో ఎటూ వారికి నామమాత్రపు బలం కూడా లేదు. వరంగల్ ఎన్నిక కూడా పూర్తయి.. అక్కడ కూడా సాంతం పరాభవం మూటగట్టుకుంటే తప్ప వారికి క్లారిటీ వచ్చే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు ఉన్నంత మాత్రాన.. ఇక్కడ భాజపా తమ బలాన్ని అతిగా ఊహించుకోవడం తగదని పలువురు హితవు చెబుతున్నారు.