కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయని చంద్రబాబు కడప గడ్డపై ప్రకటించారు. మహానాడులో టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. రాయలసీమను ఉపాధి కేంద్రంగా మార్చే ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు. లేపాక్షిలో ఏరో స్పేస్ పరిశ్రమలు పెడతామన్నారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ పరిశ్రమను తీసుకు వస్తామని తాము చెప్పలేదని అలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద పెట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తాము తరలించుకుపోబోమని అలాంటిపనులు ఎప్పుడూ చేయబోమన్నారు.
బనకచర్లపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు మహానాడు వేదికగా ఖండించారు. నీటి వినియోగంలో ఏపీ అత్యంత దిగువన ఉంటుందన్నారు. ఏపీ నుంచి సముద్రంలోకి పోయే నీళ్లను తాము ఎత్తి పోసుకుంటే..తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. గోదావరిపై కాళేశవరం కట్టుకుంటే తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. నదుల అనుసంధానం వల్ల తెలంగాణకూ లాభం జరుగుతుందని గుర్తు చేశారు.
పార్టీ వ్యవహారాలపైనా చంద్రబాబు కీలక వ్యాక్యలు చేారు. ఇంతవరకు శక్తిమేర పార్టీని సమర్థంగా నడిపానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నా బలం, బలగం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని పేర్కొన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. . బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.