తెలంగాణ రాజకీయాలు మరోసారి పొరుగు రాష్ట్రం మీద రెచ్చగొట్టే వ్యూహంతో నడుస్తున్నాయి. దిగువ రాష్ట్రమైన ఏపీ.. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటిని దోచుకుంటోందని ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. అదేలా సాధ్యమో ఒక్క సారి ఎవరూ ఆలోచించడంలేదు. ఆలోచించనివ్వడం లేదు. వరద వచ్చి తెలంగాణ ఆపుకోగలిగినన్ని నీళ్లు ఆపుకున్న తర్వాత దిగువకు వచ్చి సముద్రం పాలయ్యే నీటిని తాము రాయలసీమకు మళ్లించుకుంటామని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆ నీళ్లు మా సొంతమని తెలంగాణ నేతలంటున్నారు.
గోదావరి మీద కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. దానితో తెలంగాణ సస్యశ్యామలం అయిపోతుందన్నారు. చంద్రబాబునాయుడు ఇంకో కాళేశ్వరం కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని నేరుగానే చెబుతున్నారు. గోదావరికి వచ్చే వరదను ఎన్ని టీఎంసీలు కావాలంటే అన్ని ఆపుకోమంటున్నారు. దిగువకు వచ్చే నీటిని తాము ఎలా వాడుకున్నా తెలంగాణకు సంబంధం లేదంటున్నారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం.. ఆ దిగువకుపోయే నీటిపై హక్కులు కూడా తమవే అంటున్నారు.
సాధారణంగా జల ఒప్పందాలు బ్యారేజీల్లో, ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్నవాటిని వరకే ఉంటాయి. వాటి నుంచి ఎవరు ఎంత తీసుకోవాలన్నది ఆయా బోర్డులు నిర్ణయిస్తాయి. ఆపుకోలేక దిగువకు వచ్చే నీటిపై సర్వ హక్కులూ దిగువ రాష్ట్రానికే ఉంటాయి. ఆ రాష్ట్రం ఆపుకోవాలన్నా.. మళ్లించుకోవాలన్నా అది ఆ రాష్ట్ర సామర్థ్యం. లేకపోతే సముద్రంలోకి పోతాయి. అలా వేల టీఎంసీలు పోతున్నాయి. అలా పోయినా పర్వాలేదు … ఏపీ ప్రభుత్వం రాయలసీమ కోసం ప్రాజెక్టు కట్టుకోకూడదన్నట్లుగా బీఆర్ఎస్ నేతల వాదన ఉంది.
ఈ విషయంలో చర్చలకు .. ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పిలిచే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీతో జరిగే చర్చల్లో .. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పి.. ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. నీళ్లతో రాజకీయాలు చేసి.. రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజల మధ్య ద్వేషాలు పెంచే రాజకీయాలకు చెక్ పెట్టాల్సి ఉంది.