తెలుగుదేశం పార్టీలో చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ బ్రేక్ వేసింది. ఇక హైకామండ్ అనుమతి లేకుండా ఎవర్నీ చేర్చుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే కోవర్టుల గురించి మాట్లాడుతున్నారు. పార్టీలోకి కోవర్టులు వచ్చి పార్టీ నేతలపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. వారందరి సమాచారం తన వద్ద ఉందని తోక జాడించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల చేరికల అంశంలో ఫిర్యాదులు పెరిగిపోతూండటంతో ఇక అనుమతి ఇచ్చిన వారిని మాత్రమే చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
వినుకొండలో జరిగిన జంట హత్యలు, ఒంగోలులో జరిగిన యువనేత వీరయ్య చౌదరి హత్య ఘటనలు అన్నీ కోవర్టుల పనేని అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి చాలా మంది వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వ్యూహాత్మకంగా తమ అనుచరుల్ని కొందర్నీ వైసీపీ నేతలు పార్టీలోకి పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా వారి చేరికతో ఇప్పటి వరకూ పార్టీ కోసం కష్టపడిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పార్టీ క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా హైకమాండ్ ఇక.. ఎలాంటి అభ్యంతరాలు లేని వాళ్లను.. నిజాయితిగా ఉండే వారిని మాత్రమే పార్టలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరుకు పార్టీలో చేరాలంటే.. పెద్దల అనుమతి తప్పనిసరి చేశారు. ఈ ఉత్తర్వులతో .. పార్టీలో చేరికలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ క్యాడర్ సంతృప్తి పడుతున్నారు.