“అధికారం కోసం తోబుట్టువులు ఒకరినొకరు విశ్వసించరు. అధికారం కోసం కుటుంబ బంధాలు తెగిపోతాయి ”
అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాజకీయ అధికారం కోసం కుటుంబంలో జరిగే వివాదాల గురించి క్రీస్తు పూర్వం 300 ఏడాదిలోనే చెప్పాడు. అంటే రాజకీయం, అధికారం కోసం ఒకే కుటుంబంలో రక్తం పంచుకు పుట్టినవారి మధ్య పోరాటాలు, యుద్ధాలు అనేవి కొత్త కాదు. వింత కాదు. రాజకీయానికి ఉన్న ప్రధాన లక్షణం అదే. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వింత కాదు..రోత కాదని అర్థం చేసుకోవచ్చు. వాళ్లేదో అధికారదాహంతో కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటున్నారని నిందలు వేయాల్సిన అవసరం లేదు. రాజకీయం రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెట్టడం.. కుటుంబాలను చీల్చడం.. ఒకరి ముఖాలను ఒకరు చూసుకోలేనంత స్థాయికి దిగజార్చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో అదే జరుగుతోంది. అయితే ఎప్పుడైనా .. కరెక్ట్ చేయడానికి పెద్ద మనిషి లేనప్పుడు. ఉన్నా ఆయన మాట ఎవరూ విననప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంకా కనుసైగలతో శాసించే పొజిషన్ లో ఉండగానే ఇలాంటివి జరగడం మాత్రం అనూహ్యం.
మొదటి సారి కవిత తిరుగుబాటు
కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. గత కొన్నేళ్ల నుంచి అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోందన్న గాసిప్స్ మాత్రం ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని బహిరంగంగా తమ అనురాగాన్ని, అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని ప్రదర్శించడం ద్వారా చేతలతో ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం బహిర్గతం అయ్యాయి. అవి ఏ దశకు వెళ్తాయో తెలియదు కానీ రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయింది. ఆ లేఖను కవితే లీక్ చేశారని ఆమె కాంగ్రెస్ కోవర్టు అన్నట్లుగా కేటీఆర్ ప్రెస్మీట్లో పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆ స్పందనకు కవిత చాలా సీరియస్గా స్పందించారు. కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు బహిరంగమయ్యాయి. అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతోందని విమర్శించేవారు రాజకీయాల్లో ఉంటారు కానీ.. ఇదేమీ వింత కాదు. ఇలాంటి సమస్య అంతా ఎవరో ఒకరు తమకు అన్యాయం జరుగుతోందని గట్టిగా నమ్మినప్పుడే వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కవిత అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. తనను పార్టీ దూరం పెడుతోందని.. రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని అనుకుంటున్నారని .. పూర్తిగా రాజకీయ వారసత్వం కేటీఆర్ మాత్రమే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి దాదాపుగా ఆరు నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి పాత్రా లేకుండా పోయింది. పార్టీ వ్యవహారాలపై ఎలాంటి సమాచారం లేదు. కొద్ది నెలల పాటు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో తన రాజకీయం తాను చేయడం ప్రారంభించారు. అది ఇప్పుడు సొంత పార్టీ దిశగా వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కవిత పట్ల కేసీఆర్ చూపిన వివక్షే కారణం
అధికార వాంఛ బంధాలను ఎంతగా దూరం చేస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.. తమకే దక్కాలి.. తమకు పోటీ ఇంకొకరు ఉండకూడదన్న దురుద్దేశం ఈ బంధాలను మరింతగా దూరం చేస్తుంది. కేటీఆర్, కవిత ఇష్యూలో ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీపై తనకూ వారసత్వపు హక్కు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలో మరో పవర్ సెంటర్ ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే సోదరి అయినప్పటికీ ఆమెను నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరం చేసే వ్యూహాలు పన్నారు. నిజామాబాద్లో కవిత ఓడిపోవడం వెనుక కుట్ర ఉందని ఆమె నమ్ముతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జైల్లో ఉండటం వల్ల పోటీ కూడా చేయలేకపోయారు. కారణం ఏదైనా కవిత యాక్టివ్ రాజకీయాల్లో ఉండటం కేటీఆర్కు ఇష్టం లేదు. బయటకు తెలిసిన దాని కన్నా.. అంతర్గతంగా కేటీఆర్ ఈ విషయంలో చాలా చేశారన్న విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయం ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంది. ఎవరికీ అర్థం కాని విషయం.. కేసీఆర్ ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారనే. కేసీఆర్ చాణక్యుడని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉంటాయి. పాలనలో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యల్ని ఆయన చాలా సులువుగా మౌనంగానే ఉండి.. చివరికి ఒక్క నిర్ణయంతో పరిష్కరించేసేవారు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఏర్పడిన వివాదం.. పార్టీలో చీలికకు కారణం అవుతున్నా ఆయన చక్కదిద్దలేకపోతున్నారు. కుమార్తె రాజకియాల విషయంలో కేసీఆర్ సంతృప్తిగా లేరని సంకేతాలు వస్తున్నాయి. వివాదం ప్రారంభమైనప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు కూడా పెద్దగా జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కవితతో మాట్లాడాలని ఎంపీ , బంధువు అయిన దామోదర్ రావును పంపించారు. తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ ను పంపించారు. కానీ తండ్రి, కూతుళ్ల మధ్య ఈ మధ్యవర్తులెందుకన్న సందేహం సహజంగానే ఎవరికైనా వస్తుంది. వారి మధ్య అంత గ్యాప్ ఎందుకు వచ్చింది?. సహజంగా తండ్రి కుమార్తె మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తారని అంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ … కవిత విషయంలో అంత ఎక్కువగా అభిమానం చూపిస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. కవిత పిల్లలతో కంటే..కేటీఆర్ కుమారుడితోనే కేసీఆర్ కు ఎక్కువ అనుబంధం. ఏదైనా.. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కవిత కంటే కేటీఆర్ కే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేటీఆర్ దారికి అడ్డం రావొద్దని కవితకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. అంటే ఇక్కడ కవిత కుటుంబ పరంగా కూడా వివక్ష ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు. ఈ పరిణామాలు కవితను మరింత పట్టుదలగా మార్చారని ప్రస్తుత రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి.
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాల్లో కేసీఆర్
కల్వకుంట్ల కవిత పోరాడితే పోయేదేం లేదని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తో సమానంగా ప్రాధాన్యం దక్కితే ఆమె రాజీ పడిపోయే అవకాశం ఉంది. రేపు కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చినా ఆమె అభ్యంతరం చెప్పకపోవచ్చు.. కానీ తనకూ ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటారు. గతంలో కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చినప్పుడు.. రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్కు..జాతీయ రాజకీయాలు కవితకు అప్పచెప్పారు. కవిత కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచిందన్నట్లుగా.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల దశలన్నీ కుప్పకూలిపోయాయి. చివరికి ఒక్క లోక్ సభ ఎంపీ లేరు. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారో లేదో తెలియదు. అలాంటి స్థితికి వెళ్లిపోయింది. ఇప్పుడు సొంత రాష్ట్రంలో బలపడటమే కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం.. ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతూండటం బీఆర్ఎస్ భవిష్యత్ ను కలవరపరిచేదే. బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యల్లో ఉందని ఆ పార్టీ అగ్రనేతలకు తెలుసు. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిపోయి.. ప్రజలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాల్లేవు. బీజేపీకి కూడా ఓ చాన్స్ ఇద్దామనకుుంటారు. అందుకే కేసీఆర్ తెలివిగా రాజకీయ అడుగులు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనం దిశగా పార్టీని నడిపిస్తున్నారు. ఈ విషయం రాజకీయంగా కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమయిపోతుంది. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీతో సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. వైసీపీ అదే చేస్తూ బతికి బట్టకడుతోంది. టీడీపీ సందర్భాన్ని బట్టి విబేధిస్తూ వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటోంది. కానీ అన్ని పార్టీలు అలాంటి వ్యూహాత్మక రాజకీయాలు చేయలేవు. కేసీఆర్ చేసిన రాజకీయాల వల్ల బీజేపీకి ఆ పార్టీ పై పెద్దగా నమ్మకం లేదు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలంగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తిరుగులేని విధంగా పుంజుకుంటోంది. దక్షిణ తెలంగాణలో టీడీపీ సపోర్టు ఉంటే చాలని అనుకుంటోంది. అందుకే బీఆర్ఎస్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ విలీనం అంటే మాత్రం.. ఆశపడే చాన్స్ ఉంది. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని కవిత నేరుగానే చెప్పేశారు. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్ మరింత గందరగోళంలో పడుతుందని.. కవిత నిర్ణయానికి వచ్చారు.
అందర్నీ ఒప్పించేలా వ్యవహరించలేకపోతున్న కేసీఆర్
అయితే కేసీఆర్ తన రాజకీయ పయనం.. పార్టీ భవిష్యత్ గురించి.. రాజకీయాల్లో పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారితో ఎందుకు చర్చించడం లేదన్నదే ఇక్కడ సందేహం. వారికి పరిస్థితుల గురించి చెప్పి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మీరందరూ సహకరించాలని చెప్పి ఒకే దారిలో తీసుకు రావొచ్చు. పార్టీలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందో ముందే క్లారిటీ ఇచ్చి పరిస్థితుల్ని సర్దుబాటు చేయవచ్చు. కానీ ఎందుకు ఆయన సర్ది చెప్పలేకపోతున్నారో సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తకు కూడా అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ చీలికలు వస్తే అసలు ఏ చీలిక కూడా ఉనికి కాపాడుకోవడం సాధ్యం కాదు. కేసీఆర్ సాధించిన విజయాలకు ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉండాలి. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ మరీ దారుణంగా తయారయింది. బయటకు రాకపోవడమో.. మరో కారణమో కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకునేవారు తగ్గిపోయారు. కుటుంబంలో ఏర్పడిన గొడవల్ని సర్దుబాటు చేయలేక.. పార్టీని గాడిలో పెట్టలేక ఆయన సతమతమవుతున్నారని అనుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడు కవితను బుజ్జగించే పరిస్థితుల్లో లేరు. అలాగని ఆలే నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ తో పాటు హరీష్ రావు వంటి వారిని వాడుకుని వదిలేసినట్లుగా కుమార్తెను బయటకు పంపించడానికి ఆయనకు మసస్కరించకపోవచ్చు. కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఓ దిగ్గజ రాజకీయ నేతకు రావడం అసాధారణమే అనుకోవచ్చు.
బీఆర్ఎస్ చీలితే ఏ ముక్కకైనా మనుగడ కష్టం !
కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై బీఆర్ఎస్ మెజార్టీ నేతలకు నమ్మకం లేదు. కేవలం కేసీఆర్ ను చూసి మాత్రమే వారు కేటీఆర్ కు మద్దతు పలుకుతున్నారు. కేటీఆర్ కన్నా రెండింతలు ఎక్కువగా హరీష్ రావు నాయకత్వంపై పార్టీ నేతలకు నమ్మకం ఉంది. కేటీఆర్ కవిత కన్నా హరీష్ రావు అయితేనే బీఆర్ఎస్ ను సమర్థంగా ముందుకు తీసుకెళ్లరని మెజార్టీ క్యాడర్ అభిప్రాయం కూడా. కానీ బయటకు చెప్పలేరు. అలా చెప్పడం వల్ల మొదటగా నష్టపోయేది హరీష్ రావే. కానీ కేసీఆర్ కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన బయటకు రావడం లేదు. రేపు కేటీఆర్, కవిత పార్టీ మాదంటే మాది అని కొట్లాడుకుంటున్న సమయంలో హరీష్ రావు వారిద్దరి వైపు ఉండే అవకాశం లేదు. తనదారి తాను చూసుకుంటారు. మొత్తం పార్టీని తన గుప్పిట్లో తెచ్చుకుంటారు. అప్పుడు పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా వారు హరీష్ రావు పార్టీ వైపు దీనంగా చూడాల్సి రావొచ్చు. ఈ పరిణామాలన్నింటినీ కేసీఆర్ అలా నిస్సహాయంగాచూస్తూండిపోతారు. ఆయన ఏమీ చేయలేరు.. చేయాలని అనుకోవడం లేదు.