కాళేశ్వరం అవినీతి విషయంలో ఏమైనా తేడా వస్తే తనకూ చుట్టుకుంటుందని భావించిన ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా సాక్ష్యం చెప్పారు. సాక్షిగా కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల రీడిజైన్ తో పాటు మూడు బ్యారేజీల నిర్మాణానికి అనుమతులపై పలుమార్లు ఈటల రాజేందర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఏ మాత్రం మాట తూలినా అది తనకు కూడా చుట్టుకుంటుందని భావించిన ఈటల రాజేందర్ .. అంతా నిబంధనల ప్రకారం.. కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని తెలిపారు.
అందరూ కేసీఆర్ ఒక్కడి నిర్ణయం అని తమ పాత్ర ఏమీ లేదని చెప్పారు. ఈటల రాజేందర్ కూడా దాదాపుగా అదే చెప్పారు కానీ.. కేసీఆర్ అని చెప్పలేదు. కేబినెట్ అని మాత్రమే చెప్పారు. గంట సేపు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఇరవై నిమిషాల సేపు ఓపెన్ కోర్టులో ప్రశ్నించారు. మొత్తంగా ఈటల రాజేందర్ .. కేసీఆర్ పై ఈగ వాలనివ్వలేదని అనుకోవచ్చు. అలా వాలనిస్తే అది తన మీదకూ వస్తుందని ఫీలయ్యారు. అదే సమయంలో ఇతర విషయాలపై మాత్రం తనకు సంబంధం లేదని ఆర్థిక శాక పరిధిలోకి రాదని తెలిపారు.
కాళేశ్వరం విషయంలో గతంలో బీజేపీ నేతలు చాలా విమర్శలు చేసినా ఈటల మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. అవినీతి జరిగిందని ఎప్పుడూ చెప్పలేదు. కాళేశ్వరం విషయంలో ఆయన పాత్ర కూడా కీలకం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. విచారణ తీరుపైనా ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎవరికి నోటీసులు ఇవ్వాలో తెలియదా.. ఎందుకు సమయం వృధా చేస్తున్నారని విచారణ తర్వాత ప్రశ్నించారు.