రమణ దీక్షితులు ఢిల్లీ చాలా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది ప్రముఖులను వరుసగా కలిశారు. రమణ దీక్షితులను అడ్డం పెట్టుకుని భాజపా సాధిస్తున్న కక్ష సాధింపు ఇది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా విమర్శించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనక భాజపా రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. అంతేకాదు, ఢిల్లీలో కూడా ఈ విషయమై భాజపా చేయిస్తున్న ప్రచారమూ వేరేగా ఉండటం గమనార్హం. భాజపా అనుకూల మీడియాలో తిరుమలకు సంబంధించి ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వేంకటేశ్వరుని ఆభరణాలు ఏమయ్యాయనే చర్చలు పెడుతున్నాయి. ఈ వ్యవహారంపై కచ్చితంగా సీబీఐ ఎంక్వయిరీ ఉంటుందనే అభిప్రాయం కూడా భాజపా వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇందులో ఎలాంటి రాజకీయ కోణమూ లేకపోతే, భాజపాకి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది..? రమణ దీక్షితులపై సానుభూతి కలిగించే విధంగా ఎందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు, బ్రాహ్మణులకు చంద్రబాబు వ్యతిరేకం అనే ప్రచారాన్ని కూడా ప్రముఖంగా తెర మీదికి తెచ్చే ప్లాన్ జరుగుతున్నట్టుగా కూడా కొందరు అంటున్నారు! అంటే, దీన్ని ప్రాథమికంగా తెరమీదికి తెచ్చి… తరువాతి స్థాయిలో హిందుత్వ అంశాన్ని ప్రముఖంగా వినిపించే విధంగా వ్యూహరచన జరుగుతోందనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఆ తరువాతి దశ… హిందుత్వకు రక్షణ అంటే భాజపాతోనే సాధ్యమనే ఒక స్టాండర్డ్ ట్యాగ్ లైన్ ఎలాగూ ఉంది కాబట్టి, తద్వారా కొంత రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం భాజపాకి ఉందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
స్వతంత్రం రాకముందు నుంచీ తిరుమలేశునికి వచ్చిన నగలేంటి, వాటి పరిస్థితి ఏంటీ అనే అంశంపై సీబీఐ ఎంక్వయిరీకి ఆస్కారం అంటున్నారు. కానీ, ఈ వ్యవహారంలో క్రిమినల్ కోణం ఏదైనా ఉంటే అలాంటి ఉన్నత స్థాయి ఎంక్వయిరీ వేసినా అర్థముంటుంది. అలాంటిదేదీ లేకపోయినా కూడా అత్సుత్సాహం ప్రదర్శిస్తే… అది కేవలం ఒక సెంటిమెంట్ ను రగల్చడం కోసం జరిగే రాజకీయంగానే చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇష్యూపై భాజపా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నది చెప్పకనే తెలుస్తోంది…!