వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి ఉత్తుత్తి రాజీనామా చేశారు. ఆయన వాట్సాప్లో.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖలో చెప్పారు కానీ.. అలాంటి లేఖ ఏదీ… స్పీకర్ కార్యాలయానికి ఇంత వరకూ చేరలేదు. ఆయన అనుచరులు కూడా.. వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. అయితే.. రాజీనామాకు సిద్ధపడిన వంశీని .. వైసీపీ పెద్దలే నిలుపుదల చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి టీడీపీకి రాజీనామా చేసిన వంశీని తటస్థ సభ్యుడిగా ఉండాలని సూచించినట్లుగా చెబుతున్నారు.
పార్టీ ఫిరాయింపుల నుంచి తప్పించుకోవడంతోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా రాజకీయంగా తలనొప్పి సృష్టించేందుకు వైసీపీ… వంశీని పావుగా వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమది ఆదర్శ రాజకీయమని.. ఫిరాయిస్తే వేటు వేస్తామని వైసీపీ చెబుతూ వస్తోంది. ఈ కారణంగా వైసీపీలో చేరాలంటే.. కచ్చితంగా వేటు పడాల్సి ఉంటుంది. అయితే.. వంశీ టీడీపీకి రాజీనామా చేస్తారు కానీ.. వైసీపీలో చేరరని.. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించే అవకాశం ఉండదని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ… గెలిచిన పార్టీకి రాజీనామా చేసినా.. ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని… నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయంపై స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమం కాబట్టి.. వైసీపీ ఏం చేయాలనుకుంటే.. అదే చేస్తుంది. ప్రస్తుతానికి వైసీపీలో చేరటం, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం ఉండదని వంశీ అనుచరవర్గం చెబుతోంది. వంశీతో మాట్లాడేందుకు.. కేశినేని నాని, కొనకళ్ల నారాయణ ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. మరో వైపు.. వంశీ కార్యాలయంలో టీడీపీ ఫ్లెక్సీలు.. చంద్రబాబు ఫోటోలను.. ఆయన అనుచరులు తొలగించారు.