వైసీపీ నేత , మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న కాకాణికి సోషల్ మీడియా పోస్టింగ్ కేసులోనూ చుక్కెదురు అయింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.
టీడీపీ నేత , ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారని గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కాకాణిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్ పై కాకాణిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని మంగళగిరి CID కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కాకాణికి 14రోజులపాటు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాకాణి గోవర్దన్ రెడ్డిపై ఇప్పటికే మైనింగ్ అక్రమ తరలింపుతోపాటు… కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి అక్రమ వసూళ్లు, లారీల నుంచి అక్రమ వసూళ్లు చేశారని ముత్తుకూరు పీఎస్ లోనూ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కాకాణి. తాజాగా సోషల్ మీడియా కేసులో కాకాణికి రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ లభించినా జైల్లోనే ఉండనున్నారు.