‘బిచ్చగాడు’ ఫ్రాంచైజీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన నటించే ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్: ది బ్లాక్ డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారనే మాటే తప్పితే ఈ సినిమాకి కావాల్సినంత ప్రీరిలీజ్ బజ్ రాలేదు. చివరి ప్రయత్నంగా సినిమాలో తొలి ఆరు నిమిషాలు రిలీజ్కు ముందే వదిలేశారు. అది కంటెంట్పై మేకర్స్కి వున్న నమ్మకం. మరి ఆ నమ్మకం నిజమైందా? బ్లాక్ డెవిల్ ఎలాంటి థ్రిల్ పంచింది? విజయ్ ఆంటోనీకీ మరో విజయం దక్కిందా?
రమ్య అనే అమ్మాయి హైదరాబాద్లో హత్యకు గురవుతుంది. ఇది మామూలు హత్య కాదు. కిల్లర్ ఓ ఇంజెక్షన్ ప్రయోగించడంతో శరీరం అంతా నల్ల మసిబొగ్గులా గుర్తుపట్టడానికి కూడా వీలు లేని స్థితిలోకి మారిపోతుంది. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు ముంబయి అడిషనల్ డీజీపీ ద్రువ్ కుమార్ (విజయ్ ఆంటోనీ) దృష్టికి వస్తుంది. గతంలో ద్రువ్ కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవడంతో రమ్య కేసును పర్సనల్గా తీసుకుంటాడు. కేసును చేధించడానికి హైదరాబాద్ పోలీస్ సపోర్ట్తో అనధికారికంగా రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో ఓ నిందితుడిగా అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. తర్వాత ఏం జరిగింది? ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అరవింద్కు ఈ హత్యతో సంబంధం ఉందా? ధృవ్ కూతురు హత్యకి, రమ్య చావుకి లింక్ ఉందా? కిల్లర్ మోటివ్ ఏమిటి? అనేది మిగతా కథ.
మర్డర్ మిస్టరీ కథలన్నీ దాదాపు ఒకటే మూసలో ఉంటాయి. వరుసగా జరిగే హత్యల వెనుక కిల్లర్కి ఒక మోటివ్ ఉంటుంది. చివరికి పోలీసులు కేసును చేధిస్తారు. ఈ టెంప్లెట్ కాస్త కొత్తగా, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసి థ్రిల్లింగ్గా చెప్పడంలోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మార్గన్లో ఈ ప్రయత్నం కొంతవరకు జరిగింది. మామూలు సీరియల్ కిల్లర్లా మొదలైన ఈ కథ.. అరవింద్ పాత్ర ఎంట్రీతో సైకలాజికల్, స్పిరిచువల్ కోణంలోకి మారుతుంది. అరవింద్ లవ్ స్టోరీ ఈ కథకు అవసరం లేదని అనిపించినా.. మెల్లమెల్లగా తన గతం, తన అసాధారణ జ్ఞాపకశక్తిని కేసు విచారణకు వాడుకున్న తీరు లాజిక్కి అందకపోయినా.. ‘సూక్ష్మదేహం’ లాంటి కాన్సెప్ట్స్ పైన అవగాహన ఉంటే ఆ ఎపిసోడ్ కొత్త అనుభూతిని పంచుతుంది. విరామం ఘట్టం రసవత్తరంగానే ఉంటుంది.
క్రైమ్ థ్రిల్లర్ కథను సెకండ్ హాఫ్ నడపడం ఒక ఛాలెంజ్. ఇలాంటి కథల్లో కిల్లర్ మోటివ్ ఎప్పుడూ డార్క్గానే ఉంటుంది. అయితే ఈ కథకు కిల్లర్ బ్యాక్స్టోరీ అడ్డురాలేదు కానీ సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మందగిస్తుంది. అరవింద్ శక్తి సామర్థ్యాలను కావాల్సినదానికంటే ఎక్కువ వాడేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక పాయింట్ వరకూ ఓకే కానీ నీట్లో మునుక వేసి దివ్యదృష్టితో అంతా చూసేస్తుంటే.. ఆడియన్స్కి ఎక్కడో లాజిక్ కొట్టేస్తుంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్లో కిల్లర్ ని రివీల్ చేసే విధానం ఎక్సయిటింగ్గా ఉండాలి. ఇందులో ఆ ఆసక్తి కనిపించింది. కిల్లర్ ఎవరు? గెస్ చేసే క్రమంలో ఆడియన్స్ని బాగానే డైవర్ట్ చేయగలిగారు.
ఒక ‘ఇజం’కు కారణంగా జీవితంలో కృంగుబాటుకు గురై కిల్లర్గా మారిన వ్యక్తి కథ ఇది. అయితే తన మోటివ్లో కొన్నిలోపాలు కనిపిస్తాయి. ఇందులో మొత్తం నాలుగు హత్యలు జరుగుతాయి. ఇందులో ఇద్దరు వ్యక్తుల కారణంగా కిల్లర్కు అవమానం ఎదురవుతుంది. మిగతా ఇద్దరు అమాయకులు. కిల్లర్ని సైకోలాగా చూపించలేదు. ఒక ‘ఇజం’ కారణంగానే ఈ హత్యలు జరిగాయని చివర్లో విజయ్ వాయిస్ నోట్ ఇచ్చాడు. నిజంగా కిల్లర్ది అదే మోటివ్ అయితే.. ఇద్దరు అమాయకులతో పాటు కథకు కూడా కొంత అన్యాయం జరిగినట్లే.
విజయ్ ఆంటోనీ ఆద్యంతం ఒకటే సీరియస్గా ఎక్స్ప్రెషన్లోనే కనిపించాడు. నిజానికి ఈ కథలో ఆయన పాత్ర తక్కువే. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర అజయ్ దిశాన్ చేసిన అరవింద్. ఆ పాత్రలో చాలా కోణాలు, పొరలు ఉన్నాయి. నిజానికి అలాంటి పాత్రతో ఓ సూపర్హీరో సినిమా చేయొచ్చు. సముద్రఖని చేయాల్సిన పాత్ర కాదు. రెండు సీన్ల కోసం ఆయన లాంటి నటుడు అవసరం లేదు. బ్రిగిడ, ప్రీతిక, వినోద్ సాగర్, దీప్సిక ఈ పాత్రలన్ని కథ మేరకు కనిపించాయి. కెమరా పనితనం, సంగీతం బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది.
సూపర్నేచురల్ పవర్స్ లాంటి ఓ క్యారెక్టర్తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే దీనికి ఒక ‘ఇజం’ తోడైంది. కానీ దాని మోటివ్ సరిగ్గా కుదరకపోవడంతో ముగింపు కాస్త బలహీన పడింది. అయితే ఇది మరీ చప్పగా సాగిన సినిమా ఏం కాదు. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. మైండ్ బెండింగ్ థ్రిల్లర్ కోవలోకి రాదు కానీ ఒక మోస్తారు థ్రిల్లర్ చూసిన అనుభూతి కలిగిస్తుంది.