ఈనెల 2 నుంచి థియేటర్ల బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బంద్ క్లైమాక్స్కి వచ్చినట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు, సర్విస్ ప్రొవైడర్ల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. యూఎఫ్ ఓ, క్యూబ్ రేట్లు పూర్తిగా ఎత్తి వేయాలన్నది చిత్ర నిర్మాతల డిమాండ్. ఆపరేటర్లు మాత్రం 9 శాతం తగ్గిస్తాం అంటున్నారు. ఇప్పుడు మధ్యస్తంగా ఓ బేరం కుదిరిందని, దానికి ఇరు వర్గాలూ అంగీకరించాయని తెలుస్తోంది. ఈ శుక్రవారం నుంచి థియేటర్లు మళ్లీ యధావిధిగా తెరిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన చర్చల్లో కొంతమంది తమిళ నిర్మాతలు కూడా పాల్గొన్నారని, దక్షిణాది మొత్తం బంద్కి పిలుపునిస్తే… సర్వీస్ ప్రొవెడర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయని భావించి.. కాస్త దిగి వచ్చారని తెలుస్తోంది. మరి అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.