విశాఖపట్నంలోని భీమిలి తీర ప్రాంతం నేడు రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా రూపుదిద్దుకుంటోంది. కేవలం ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగానే కాకుండా, అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఇది ఎదుగుతోంది. ముఖ్యంగా 2026 నాటికి విశాఖ హౌసింగ్ మార్కెట్ 6-10% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తుండగా, భీమిలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు 30-50% వరకు పెరుగుతున్నాయి. కాలుష్యానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీర జీవనాన్ని గడపాలని కోరుకునే వారికి భీమిలి ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది.
ఈ ప్రాంతంలో వెలుస్తున్న పర్యావరణ అనుకూల రిసార్ట్ విల్లాలు , సెకండ్ హోమ్స్ కొనుగోలుకు ప్రవాస భారతీయులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో కేవలం పెట్టుబడి కోసం చిన్న అపార్ట్మెంట్లను ఎంచుకున్న ఎన్ఆర్ఐలు, ఇప్పుడు విశాలమైన 3BHK విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఇవి తమ సొంత నివాసాలుగా ఉపయోగపడటమే కాకుండా, ప్రీమియం రెంటల్ మార్కెట్ ద్వారా ఏటా 6-10% వరకు ఆదాయాన్ని అందించే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం.
ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా ఈ ప్రాంతానికి కొత్త ఊపునిస్తున్నాయి. విశాఖ-భీమిలి తీర ప్రాంతాన్ని వైజాగ్ బే సిటీ పేరుతో అంతర్జాతీయ స్థాయి పర్యాటకపట్టణ హబ్గా మార్చే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దాదాపు 25 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ తీర కారిడార్లో 2,000 పైగా హోటల్ గదులు, రిసార్టులు, బోర్డ్వాక్లు , సుమారు 6,000 ప్రీమియం నివాస యూనిట్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ భారీ ప్రాజెక్టులు భీమిలి ప్రాంతం యొక్క రియల్ ఎస్టేట్ విలువను మరింతగా పెంచుతున్నాయి.
మౌలిక సదుపాయాల పరంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, 45 కిలోమీటర్ల తీరప్రాంత రహదారి కనెక్టివిటీ భీమిలికి వరంలా మారాయి. దీనికి తోడుగా ఐటీ రంగం విస్తరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని నితి ఆయోగ్ గ్రోత్ హబ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుస్థిరమైన అభివృద్ధి, అధిక రాబడి , ఆధునిక జీవనశైలి కలగలిసిన భీమిలి తీరం, రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన , విలాసవంతమైన రియల్ ఎస్టేట్ కేంద్రంగా అవతరించనుంది.
