తెలుగు టీవీ ఛానళ్లది ఓ దారి, సాక్షిది మరో దారి. ప్రపంచంలోని ప్రతీ విషయాన్నీ ‘జగన్’ తో ముడి పెట్టి చూడడం ఈ ఛానల్ ప్రత్యేకత. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. తమిళనాడులో విజయ్ వీర విహారం చేసిన వేళ, ఆ విజయాన్ని కూడా జగన్ ఖాతాలోకే వేయడానికి సాక్షి ఛానల్ పడిన ఆపసోపాలు చూస్తే మనకు నవ్వాగదు.
తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచిన వైనంపై సాక్షి టీవీ ఓ కథనం రెడీ చేసి, ప్రసారం చేసింది. జగన్ అడుగు జాడల్లో విజయ్ నడవడం వల్లే, తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచిందన్నట్టు బోల్డంత కామెడీ చేసేసింది. ఏపీలో జగన్ వాలంటరీ వ్యవస్థ ప్రవేశ పెడితే, విజయ్ దాన్ని తమిళనాట అనుసరిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానంతో యూత్ ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పుకొచ్చింది. తమిళనాట కూడా జగన్ అభిమానులు ఉన్నారని, వాళ్లంతా విజయ్కే ఓట్లేసి గెలిపించుకొన్నారని, అలా తమిళ రాజకీయాలపై కూడా జగన్ తన వంతు ప్రభావం చూపించాడన్నట్టు.. ఓ కథనం వండి వార్చేసింది. జగన్నీ, విజయ్నీ పక్క పక్కన చూపిస్తూ, ఇద్దరిదీ ఒకే పార్టీ అన్నట్టు, ఇద్దరి వ్యూహాలూ ఆలోచనలూ ఒకే రేంజ్ అన్నట్టు ఇచ్చిన బిల్డప్పులు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జగన్ సింగిల్ గా పోటీకి వచ్చాడని, అదే పద్ధతిలో.. విజయ్ కూడా సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించాడన్నది ఈ కవరేజీ సారాంశం. అయితే సింగిల్ గా పోటీ చేసిన సింహం 11 సీట్లకే పరిమితమైందన్న సత్యాన్ని మాత్రం చెప్పడానికి సాక్షికి ధైర్యం రాలేదు. మరోవైపు విజయ్ ఇప్పుడు సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించలేడు కూడా. ఈ విషయాన్ని కూడా సాక్షి చెప్పలేకపోతోంది. ప్రచారంలో విజయ్ జగన్ ఫొటో చూపించాడని, అక్కడితోనే విజయ్ గెలుపు ఖాయమైందంటూ సాక్షి కూతలు కూస్తుంటే – ‘అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా… వీళ్లని’ అనాలనిపిస్తుంది.
కొన్ని చోట్ల అయితే… వైఎస్సార్ కార్యకర్తలు మరింత ఓవరాక్షన్ చేశారు. జగన్, విజయ్ ఫొటోలు పట్టుకొని, రోడ్లంబట తిరిగారు. ‘జై జగన్’ అంటూ నినదిందించారు. అసలు ఏపీలో జగన్ కీ, తెలంగాణలో విజయ్కీ ఏమిటి సంబంధం? విజయ్ గెలుపుని తమ ఖాతాలో వేసుకోవడానికి ఎందుకింత తాపత్రయం అని అడిగితే.. వాళ్లకు అదో తృప్తి.. అంతే.
ఇదంతా చూసి నెటిజన్లు నవ్వుకొంటున్నారు. ‘విజయ్కి పదకొండు సీట్లు తక్కువ వచ్చాయ్… మీరేమైనా కలుస్తారేంటి?’ అంటూ ఎగతాళి చేస్తున్నారు. లేనిపోని బిల్డప్పులు ఇవ్వడం, ఆనక… అభాసుపాలు అవ్వడం.. వైసీపీకీ, సాక్షిని ఇవన్నీ మామూలే.
