లిక్కర్ కేసులో జగన్ మోహన్ రెడ్డి మనీ ట్రాన్స్ పోర్టర్గా పేరు మోసిన నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టి .. ఆ కంపెనీల ద్వారా విదేశాలకు మనీలాండరింగ్ చేశాడని.. పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశాడని సిట్ గుర్తించింది. పెద్దగా బయట కనిపించకుండా.. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట అయిన సునీల్ రెడ్డి ఎన్ని కంపెనీలు పెట్టి.. డబ్బు తరలింపు పూర్తయ్యాక మూసేశాడో చెప్పడం కష్టమని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి జగన్ రెడ్డి ఎలా డబ్బులు లాండరింగ్ చేశాడో అన్ని సాక్ష్యాలు ఎప్పుడో బయట పడ్డాయి. స్వయంగా పార్లమెంట్ లో ఎంపీ లావు కృష్ణదేవరాయులు లిక్కర్ స్కాంపై సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు అన్ని వివరాలు బయట పెట్టారు. ఈ సునీల్ రెడ్డి ద్వారా దేశం బయటకు డబ్బులు ఎలా తరలించాలో కూడా వివరించారు. ఈడీ దగ్గరకు కూడా ఈ సమాచారం వెళ్లింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ దర్యాప్తు చివరి దశకు రావడంతో.. సునీల్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
అంతకు ముందు జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏను పట్టుకుని చాలా వివరాలు రాబట్టారు. ఇప్పుడు సునీల్ రెడ్డి బాగోతం వెలికి తీస్తున్నారు. ఇదంతా కింగ్ పిన్ ను పట్టుకోవడానికి జరుగుతున్న కసరత్తులో భాగం. ఇప్పటికే సేకరించిన ఆధారాలను వ్యాలిడేట్ చేయడానికి ఈ సోదాలు అని భావిస్తున్నారు. మెల్లగా సూత్రాధారి వద్దకు కేసు వెళ్తోందని.. అరెస్టులకు సమయం దగ్గర పడిందని అంచనాలు ప్రారంభమయ్యాయి.