అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై అక్రమ కేసులు, కుట్రలతో వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ.బీ. వెంకటేశ్వరరావు గతంలోనే చాలెంజ్ చేశారు. ఇప్పుడు ఆయన యాక్షన్ ప్రారంభించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత హైకోర్టులో క్లీన్ చిట్ సాధించిన ఆయన, ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టిన అధికారులను చట్టపరంగా వేటాడటం ప్రారంభించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 80 కింద మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్తో సహా 11 మంది అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, రూ. కోటి ..ఒక్క రూపాయి పరువునష్టం దావా వేయడం పోలీస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
తప్పుడు పత్రాల సృష్టి, ఫోర్జరీ నివేదికలతో తన కెరీర్ను నాశనం చేసేందుకు కొందరు అధికారులు ఏ విధంగా కుట్ర పన్నారో ఏబీవీ తన నోటీసుల్లో ఎండగట్టారు. నిఘా పరికరాల కొనుగోలు పేరుతో అక్రమంగా సస్పెండ్ చేయడమే కాకుండా, తప్పుడు తేదీలతో మెమోలు సృష్టించి తన ప్రతిష్టను దిగజార్చారని ఆయన ఆరోపించారు. అప్పట్లో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని తప్పుడు అజెండాతో తనను బలిపశువును చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఆయన కల్పించారు.
ఈ న్యాయపోరాటంలో ఆయన కేవలం పోలీసు అధికారులనే కాకుండా, తనపై దుష్ప్రచారం చేసిన నాటి ప్రభుత్వ పీఆర్వోలను సైతం వదల్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాల్లో తనపై విషప్రచారం చేసిన వారిని కూడా బాధ్యులుగా చేస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. తన నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించి, జాతీయ స్థాయిలో తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినందుకు గానూ, వడ్డీతో కలిపి భారీ పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందేందుకు, తనను మానసిక వేదనకు గురిచేసిన ‘విక్టిమైజేషన్’ పర్వానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఏబీవీ పావులు కదుపుతున్నారు. నిర్ణీత సమయంలోగా స్పందించని పక్షంలో క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడబోనని హెచ్చరించడం ద్వారా, అక్రమ కేసులతో వేధించే సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఆయన నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏబీవీ మొదలుపెట్టిన ఈ రివర్స్ అటాక్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.