రఘురామకృష్ణరాజు అవసరం అనుకున్నప్పుడల్లా హోంమంత్రి అమిత్ షాను కలిసి చెప్పాలనుకున్నది చెప్పి వినతి పత్రం ఇచ్చి వస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేసిన వారందరికీ రివర్స్లో ఫిర్యాదు చేయాలనుకునే స్ట్రాటజీ.. పెట్టుకున్న వైసీపీ నేతలకు మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు. ఎంత ప్రయత్నించినా షా దగ్గరకు రానివ్వడం లేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా .. పార్లమెంట్లోని తన చాంబర్లో కాస్తంత తీరికగా ఉంటున్నారు. అడిగిన వారికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తున్నారు.
గత వారం రఘురామకృష్ణరాజు అమిత్ షాను కలిసి మాట్లాడారు. ఆ ఫోటోలను రఘురామకృష్ణరాజు విడుదల చేశారు. తాను ఏపీలో ఉన్న పరిస్థితులు.. అక్కడి పాలనా తీరును వివరించానని ఆయన చెప్పారు. ఆయన ఏం మాట్లాడారో కానీ.. ఆయనతో అయితే బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన బీజేపీలో చేరబోతున్నారని వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. స్వయంగా పార్లమెంట్లోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. దీంతో సహజంగానే ఆయన మాటలకు అక్కడ విలువ ఉంటుంది. వెంటనే తాము కూడా అమిత్ షాతో భేటీ అయి ఆయన ఫిర్యాదు చేసిన అంశాలకు కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ సమయం చిక్కలేదు.
ఎట్టకేలకు అతి కష్టం మీద మంగళవారం రెండు నిమిషాల సమయం తీసుకుని పార్లమెంట్లోని అమిత్ షా చాంబర్లో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిశారు. వినతి పత్రం అందించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇచ్చామని చెబుతున్నప్పటికీ… ఆ అంశాలేమిటో స్పష్టతలేదు. ఎప్పట్లాగే పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ ఉన్నాయని జాబితా వివరిస్తారు. అయితే ప్రధానంగా ఆయన రఘురామరాజుపై చర్యల గురించే ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. ఏదైతేనేం ప్రయత్న లోపంలేకుండా ప్రయత్నించామన్న సంతృప్తి మాత్రం వారికి మిగిలింది.