అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించిన జర్నలిస్ట్ లకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా, ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యానించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని, మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పేందుకు నామోషీ ఎందుకు అని ప్రశ్నించారు షర్మిల.
వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పకుండా మళ్లీ, మళ్లీ అదే తప్పు చేస్తున్నారని షర్మిల అన్నారు. సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనను కూడా వదిలిపెట్టలేదని , సైతాన్ సైన్యంతో తనపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. వైఎస్ బిడ్డ అని, ఓ మహిళా అని కూడా చూడకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచారు అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
మాట, మాటకి జగన్ నా అక్కా, చెల్లెళ్లు అంటూ అంటారు కదా.. సొంత చెల్లికి మర్యాద ఇవ్వలేదు.. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారని షర్మిల ప్రశ్నించారు. అమరావతి ప్రాంత మహిళలకు జగన్ , సజ్జల క్షమాపణలు చెప్పాల్సిందేనని మరోసారి పునరుద్ఘాటించారు షర్మిల.