వైఎస్ జగన్ పై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలకు రక్త సంబంధాల గురించి తెలియదని , సొంత అన్నయ్యపై రాజకీయ స్వార్ధం కోసం విమర్శలు చేస్తుందన్న మాజీ మంత్రి రోజాకు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షర్మిల. రక్త సంబంధాల గురించి, అక్కా , చెల్లెళ్ళ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. రక్త సంబంధం విలువ ఏంటో తనకు మాత్రమే తెలుసు అని అన్నారు ఆమె.
తన ఇంటి నుంచే తనపై విష ప్రచారం చేశారని , తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని , తను వైఎస్సార్ కు పుట్టలేదని సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. జగన్ అడిగాడు అని, తన భర్త, పిల్లలను వదిలేసి మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని , అది రక్తసంబంధానికి ఇచ్చిన విలువ అంటూ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. పాప నీ ప్రాణం కావాలని జగన్ అడిగినా వెంటనే ఇచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.
తల్లిని,చెల్లిని దూరం చేసుకున్న నాడే మీరు మనిషి జాబితా నుంచి బయటకొచ్చారని ఫైర్ అయ్యారు షర్మిల. మీరు అసలు మనుషులు కాదంటూ నిప్పులు చెరిగారు. రక్త సంబంధాల గురించి మాట్లాడేందుకు రోజాకు సిగ్గుండాలి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్సార్ బిడ్డకు లేదని, ఎవరు ఎవరికీ మద్దతు ఇచ్చారో రాష్ట్రమంతా తెలుసు అని అన్నారు షర్మిల. ఐదేళ్ళు జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడని, వైఎస్సార్ వ్యతిరేకించిన పార్టీ కోసం జగన్ ఊడిగం చేశాడని అన్నారు.