బనకచర్ల ద్వారా సముద్రంలోకి పోయే నీటిని ఎత్తి పోసుకుని రాయలసీమకు పంపించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కు సెంటిమెంట్ రాజకీయాల కోసం ఉపయోగపడుతున్నాయి. ఏపీ దిగువ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో నిల్వ ఉండని.. ప్రాజెక్టులకు సంబంధం లేని.. వరద వచ్చినప్పుడు మాత్రమే సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసుకునే ప్రాజెక్టును డిజైన్ చేసుకుంటే బీఆర్ఎస్ జల దోపిడీ అని రాజకీయం ప్రారంభించారు.
అసలు ఏపీ దిగువ రాష్ట్రం. ఆరోపణలు చేయాల్సింది ఎగువరాష్ట్రమైన తెలంగాణ మీద. తెలంగాణ మీద ఆరోపణలు చేయాల్సిన ఏపీ మీద.. రివర్స్ లో జల దోపిడీ ఆరోపణలు చేస్తున్నారు. చిన్న లాజిక్ కూడా లేకుండా.. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేయడానికి హరీష్ రావు ఓ అడుగు ముందుకేశారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి బనకచర్ల వల్ల మహబూబ్ నగర్, డిండి వంటి ప్రాజెక్టులకు సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అవి కృష్ణా బేసిన్ లో ఉంటాయి. అసలు గోదావరి నీళ్లు ఎత్తిపోసుకుంటే..కృష్ణాలో ఎందుకు సమస్యలు వస్తాయో హరీష్ చెప్పలేదు.
అసలు దిగువ రాష్ట్రం ఎలా జల దోపిడీ చేస్తుందో ఆయన ప్రెస్మీట్లో చెప్పలేదు. గోదావరిపై కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును నిర్మించుకున్నారు. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే నిర్మించుకోమని చంద్రబాబు చెబుతున్నారు. అయినా రాజకీయాల కోసం రెచ్చగొట్టే పనులు మాత్రం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలా నష్టమో మాత్రం ప్రెస్మీట్ మొత్తం మీద చెప్పలేదు. కేంద్రం నిధులిస్తోందని బాధపడ్డారు. రాయలసీమకు నీళ్లు వస్తాయని బాధపడ్డారు. రాజకీయం చేయాలన్న ఆతృత, నీటి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాలన్న రాజకీయం తప్ప హరీష్ రావు ప్రెస్మీట్లో అసలు లాజిక్ లేకుండా పోయింది.