తల్లికి వందనం పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి హడావుడి లేకుండా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం అసలు పబ్లిసిటీ చేసుకోలేదేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ బాధ్యతను వైసీపీ తీసుకుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ పెడుతోంది. ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆ ప్రచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.
తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని ముందుగా ప్రజలకు చెప్పింది వైసీపీనే. పదమూడు వేలు జమ అవుతున్నాయని.. రెండు వేలు కోత పెట్టారని విమర్శించడం ప్రారంభించారు. వైసీపీ హయాంలోనూ అంతే ఇచ్చారన్న సంగతిని ప్రజలు మర్చిపోయారని అనుకున్నారేమో కానీ.. చాలా మంది తల్లులకు.. ఇరవై ఆరు వేలు జమ అయ్యాయి. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నారు కాబట్టి.. ఆ తేడాను వారు పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ ప్రచారం అలా రివర్స్ అయింది. తామే భారీగా ప్రచారం చేసి పెట్టామని .. రివర్స్ లో లోకేష్ లీగల్ యాక్షన్ ప్రారంభించారని తెలిసే సరికి.. టోన్ మార్చారు.
అనర్హులకు ఇచ్చారంటూ.. విమర్శలు ప్రారంభించారు. నిజానికి 30 లక్షల మందికి ఎగ్గొట్టారని ప్రచారం చేశారు. అదీ వర్కవుట్ కాలేదు. ఆ ముఫ్ఫై లక్షల జాబితా అడుగుతారని సైలెంటు అయిపోయారు. తర్వాత పెద్ద అనర్హులకు ఇచ్చారని .. ఒకే ఆధార్ పై నమోదైన కొన్ని నెంబర్లను చూపించి ఫేక్ చేయడం ప్రారంభించారు. నిజానికి ఇలా ఒకే ఆధార్ పై ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు నమోదు అయితే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇంకా జమ చేయలేదు. ఆ విషయం ప్రభుత్వం బయట పెట్టేసరికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
వైసీపీ తల్లికి వందనంపై ప్రచారం చేసేలా చేసుకుని .. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా వైసీపీ సోషల్ మీడియా వ్యూహం అమలు చేస్తూండటంతో వ్యతిరేక ప్రచారం కాస్తా.. ప్రజల్లో పథకంపై పాజిటివ్ చర్చకు కారణం అవుతోంది.