మ్యాట్లు తీసుకెళ్లారు. భోజనం ప్యాకెట్ల కోసం తోసుకున్నారు. పిల్లల్ని నేల మీద పడుకోబెట్టారు అని సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. కొంత మంది ఫేక్ వీడియోలు పెట్టి తెగ రెచ్చిపోతున్నారు. యోగాంధ్రలో చిన్న పొరపాటు లేకుండా అద్భుతంగా జరగడం వీరందర్నీ తెగ నిరాశపరిచిందని సులువుగానే అనుకోవచ్చు. గిన్నిస్ రికార్డు సాధించిన అద్భుతమైన కార్యక్రమం నుంచి.. యోగా వల్ల జరిగే ఉపయోగాల గురించి చెప్పకుండా.. మ్యాట్లు ఎత్తుకెళ్లిపోయారు.. భోజనం ప్యాకెట్ల కోసం తోసుకున్నారని ప్రచారం చేయడం మానసిక వైకల్యమే అనుకోవచ్చు.
యోగా మ్యాట్లను.. యోగా చేయడానికి వచ్చిన వారికి ఇచ్చారు. ఎవరికి వారు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. ఎక్కడో ఓ చోట కొంత మంది వదిలేసి వెళ్లిపోతే వాటిని ఇతరులు తీసుకునే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లారు. అది కార్యక్రమం అయిపోయిన తర్వాత జరిగింది. భోజనం ప్యాకెట్ల కోసం తోసుకున్నారన్నది కూడా అబద్దమే. ఉదయమే భోజనం ఎవరూ ఇవ్వరు. అల్పాహారం మాత్రమే ఏర్పాటు చేశారు. అంత పెద్ద కార్యక్రమంలో …. విశాఖ నుంచి బోగాపురం వరకూ నిర్వహించిన కార్యక్రమంలో ఓ చోట చిన్న తోపులాట జరిగితే అదే పెద్దగా ప్రచారం చేయడం మానసిక వైకల్యం కాక మరేమిటి ?
మరికొంత మంది యోగా కోసం డ్వాక్రా మహిళల్ని తీసుకెళ్లారని పిట్టకథలు సోషల్ మీడియాలో రాయడం ప్రారంభించారు. అది ఏమైనా రాజకీయ సభనా ?. యోగాపై ఆసక్తి లేకుండా.. కనీస ప్రాక్టీస్ లేకుండా ఎవరైనా గంట పాటు యోగా చేయగలరా?. గిన్నిస్ రికార్డు కోసం జన సమీకరణ చేయడానికి సభ ఏం కాదు. అయినా తమ మనో వైకల్యాన్ని అలా ప్రదర్శించుకుంటున్నారు. ఖర్చు అని..మరొకటి అని కూడా రెచ్చిపోతున్నారు.
కుటుంబంలో ఓ గొప్ప ప్రోగ్రాం జరిగితే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ రాష్ట్రంలో ఓ మంచి కార్యక్రమం జరిగితే ఓర్చుకోలేని వారు.. తప్పుడు ప్రచారాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి వల్ల వారి కుటుంబాలకైనా ప్రయోజనం ఉంటుందో లేదో చెప్పడం కష్టం. గత ప్రభుత్వం.. పార్టీ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి సభలు నిర్వహిస్తే ఒక్కరూ మాట్లాడలేదు. ఉత్తరాంధ్ర మొత్తానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం నాలుగు వందల కోట్లు ఖర్చు చేయలేదు కానీ.. రుషికొండ ప్యాలెస్ కు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు. అయినా మాట్లాడలేదు. ఈ దౌర్భాగ్యం ఆంధ్రకే సొంతం అనుకోవాలి.