వెండితెర ఇలవేల్పులాంటి కథానాయకుడు చిరంజీవి. ఆయనతో సినిమా చేయాలనే సరదా అందరికీ ఉంటుంది. సునీల్ నారంగ్కీ కూడా చిరుతో సినిమా చేయాలని ఉంది. ఈ విషయంలో చాలాసార్లు వాళ్ల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ‘కుబేర’ సక్సెస్ మీట్లో తన మనసులో మాట చెప్పారు చిరు. సునీల్ నారంగ్ కుమార్తె జాహ్నవి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. జాహ్నవితో ఓ సినిమా చేస్తానని, ఆ సినిమా ‘కుబేర’లాంటి సీరియస్ కంటెంట్ కాకుండా, తనదైన ఎంటర్టైన్మెంట్తో ఉంటే బాగుంటుందని చెప్పారు చిరు.
నిర్మాతగా తక్కువ కాలంలోనే వెలుగులోకి రావాలంటే ఓ పెద్ద హీరో సినిమా చేయాలి. ప్రస్తుతం ప్రియదర్శితో ఓ సినిమా చేస్తున్నారు జాహ్నవి. ఇది సోలో నిర్మాతగా ఆమె తొలి ప్రయత్నం. ఒకవేళ చిరు సినిమా ఓకే అయితే గనుక, నిర్మాతగా జాహ్నవి ప్రయాణం నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం ఖాయం. జాహ్నవికి తండ్రి సునీల్ నారంగ్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఆయన పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్లో సినిమా సెట్ కావడం పెద్ద విషయం కాదు.