కూల్చివేతలతో దడ పుట్టిస్తున్న హైడ్రాకు ఇప్పుడు న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బతుకమ్మ కుంట భూముల వివాదం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఒక అగ్నిపరీక్షగా మారింది. ఈ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు, భూమి యాజమాన్య హక్కులపై హైడ్రా కమిషనర్ హైరానా పడుతున్నారు. సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇవ్వడంతో.. బతుకమ్మకుంట వద్ద బోర్డులు తీసేయాల్సి వచ్చింది.
న్యాయపోరాటంలో హైడ్రా!
బతుకమ్మ కుంట భూములపై బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ చేస్తున్న వాదనలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. సుధాకర్ వద్ద కేవలం 1986 నాటి అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందని, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేని పక్షంలో ఆ భూమిపై హక్కులు చెల్లవని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కోర్టు సైతం సుధాకర్ ఆధీనంలో భూములు లేవని చెప్పిందన్నారు. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అక్కడ బోర్డులు, నిర్మాణాలను హైడ్రా తొలగించినప్పటికీ, కోర్టు ధిక్కార నోటీసులు అందడం హైడ్రాకు కొంత ప్రతిబంధకంగా మారింది. న్యాయస్థానాల ఆదేశాలను శిరసావహిస్తూనే, తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది.
శాటిలైట్ సాక్ష్యాలు.. నాసా ఫోటోలతో కౌంటర్
సుధాకర్ అక్కడ అసలు చెరువే లేదని వాదిస్తుండగా, హైడ్రా అందుకు పూర్తి భిన్నమైన చారిత్రక ఆధారాలను బయటపెట్టింది. 1990 నాటి NASA శాటిలైట్ ఫోటోలు , అలాగే 1970 నాటి భారతీయ నీటి సర్వే నివేదికల్లో బతుకమ్మ కుంట ఉనికి స్పష్టంగా ఉందని కమిషనర్ వెల్లడించారు. పహానీలలో సైతం ఈ చెరువు ఎర్ర కుంట పేరుతో నమోదై ఉందని, ఒక వ్యక్తి భూమిని తాము చెరువుగా మార్చామనే వాదనలో నిజం లేదని ఆయనంటున్నారు. కోర్టు దృష్టికి అన్ని వివరాలు తీసుకెళ్తామన్నారు.
రూ. 18,000 కోట్ల విలువైన భూముల రికవరీ
హైడ్రా ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే ఫలితాలను సాధించిందని రంగనాథ్ చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2,093 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసినట్లు రంగనాథ్ గణాంకాలను వెల్లడించారు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఈ భూముల విలువ దాదాపు రూ. 18,000 కోట్లు ఉంటుందని అంచనా. ఫాతిమా కాలేజీ ఇష్యూ వంటి కేసుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్టీఎల్ డిమార్కింగ్ చేయాల్సి ఉందని, ఇలా ప్రతి అడుగులోనూ న్యాయపరమైన అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం హైడ్రాకు సవాలుగా మారింది.
