వరంగల్ ఉప ఎన్నికలలో ఘోర పరాజయంతో క్రుంగిపోతున్న బీజేపీకి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. హైదరాబాద్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకి కిషన్ రెడ్డే ప్రధాన అవరోధంగా ఉన్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాల గురించి గట్టిగా ప్రచారం చేసి, తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయకుండా కిషన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో మరెవరినీ పైకి ఎదగకుండా ఆయన అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే ముందు కిషన్ రెడ్డిని పదవిలో నుండి తొలగించాలని అన్నారు. కిషన్ రెడ్డి తీరు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ కూడా వ్రాశానని రాజా సింగ్ తెలిపారు.
సాధారణంగా ఒక పార్టీ నేత మీడియా ముందుకు వచ్చి ఈవిధంగా మట్లాడుతుంటే దానర్ధం అతను లేదా ఆమె పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లే భావించవచ్చును. త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక దానిలో నెగ్గేందుకు అధికార తెరాస ఇతర పార్టీల నేతలకు వల విసిరితే అందులో ఆశ్చర్యమేమీ లేదు. బహుశః రాజా సింగ్ కూడా తెరాసలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారేమో? అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఆయన పార్టీలోనే ఉండదలిస్తే ఏకంగా పార్టీ అధ్యక్షుడుపై ఈవిధంగా విమర్శలు చేసే సాహసం చేయరు.
కానీ రాజా సింగ్ చేస్తున్న ఆరోపణలలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. తెలంగాణాలో తెదేపాతో పొత్తులు పట్టుకోవాలని బీజేపీ అధిష్టానం భావించినప్పుడు ఆ ప్రతిపాదనని కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పొత్తులు పెట్టుకొన్నా కూడా సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించలేకపోయారు. వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ తరపున నిలబెట్టేందుకు పార్టీలో బలమయిన అభ్యర్ధి లేకపోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ కిషన్ రెడ్డి పార్టీలో తన క్రింద ఉన్న నేతలకు ప్రోత్సాహం ఇచ్చి ఉండి ఉంటే వారే బలమయిన నేతలుగా ఎదిగేవారు. కానీ కిషన్ రెడ్డి ఆ పని చేయకపోవడం వలననే డా. దేవయ్యను అమెరికా నుండి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. కానీ వ్రతం చెడ్డా ఫలం కూడా దక్కలేదు.