పార్టీని నడిపించడం అంటే రేవంత్ రెడ్డిని బూతులు తిట్టించడం, సోషల్ మీడియాలో ఎమ్మెల్యేల క్యారెక్టర్లపై తప్పుడు ప్రచారాలు చేయించడం, యూట్యూబ్ చానళ్లలో థంబ్ నైల్స్ పెట్టించుకుని సంతృప్తి పడటం కాదు. కానీ బీఆర్ఎస్ ను ఇప్పుడు నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు పూర్తిగా అవే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాల సంగతేమో కానీ.. సామాన్య ప్రజల్లో ఇదేమి రాజకీయం అనే అసహ్య భావన పెరిగేలా రాజకీయం చేస్తున్నారు. ఆయన తీరు చూసి.. సీనియర్ నేతలు కూడా.. ఇలాగయితే ఎలా అని మథనపడుతున్నారు.
కేటీఆర్పై ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్
తిట్లు అనేవి ఎవరైనా మాట్లాడవచ్చు. అదేమి బ్రహ్మ విద్య కాదు. అందరికీ నోరు ఉంటుంది. కానీ .. ఆ తిట్లు, మాటలు క్యారెక్టర్ పై ముద్ర వేస్తాయి. కేటీఆర్ అలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నారు. కేటీఆర్ ను తిట్టడానికి రేవంత్ రెడ్డికి నోరు లేక కాదు… లేదా కాంగ్రెస్ నేతలకు లేక కాదు. తిరిగి తిడితే కేటీఆర్కు.. కాంగ్రెస్ నేతలకు తేడా ఏముందని జనం అనుకుంటారు. అందుకే కేటీఆర్ మాత్రమే దారి తప్పారని ప్రజలకు చూపించడానికి వారు అలాంటి మాటలు మాట్లాడటంలేదు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోని కేటీఆర్.. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు.
ఆవేశం కాదు.. ఆలోచనతో చేసేదే రాజకీయం
కేటీఆర్ కు అహంకారం ఎక్కువని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన వ్యవహారశైలి అలాగే ఉంటుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన అగ్రనేతలెవరూ కేసీఆర్ పై ఆగ్రహంగా ఉండరు.. వివేక్, పొంగులేటి , విశ్వేశ్వర్ రెడ్డి , ఈటల సహా చాలా మంది కేటీఆర్ తీరు వల్లనే బయటకుపోయారు. స్వల్ప తేడాతో ఓడిపోయిన బీఆర్ఎస్.. అలాంటి నేతల్ని కాపాడుకుని ఉంటే మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండేదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ కేటీఆర్ తన వైపు తప్పుల్ని దిద్దుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకా ఇంకా అహంకారపూరితంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. గతంలో తమ పార్టీ నేతలపై చూపించేవారు. కానీ ఇప్పుడు నేరుగా ప్రజలపై చూపిస్తున్నారు.
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారా ?
ఎన్నికలు వస్తే ఇక ప్రమాణ స్వీకారం చేయడమే అని కేటీఆర్ అనుకుంటున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందని ఫీలవుతున్నారు. ఆయన అదో రకమైన ఊహా ప్రపంచంలో బతికేస్తున్నారు. బయటకు అలా కనిపిస్తున్నారా లేకపోతే నిజంగా అదే భావనలో ఉన్నారా అన్నది బీఆర్ఎస్ నేతలకే తెలియాలి. అలా కనిపించేందుకు ప్రయత్నిస్తే.. ప్రజల్ని ఆకట్టుకునే రాజకీయాలు చేయాలి. అలాంటివి చేయడం లేదు. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం లేదు. ప్రతిపక్షంగా తాము ప్రజా సమస్యలపై పోరాడుతున్నామా.. ప్రజల్ని తమ పోరాటాలు ఆకట్టుకుంటున్నాయా అన్నది పరిశీలన చేసుకోవడం లేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన పోరాటం ఏమి లేదు.
పార్టీని నడపడం చేతకావడం లేదని కేటీఆర్పై కవిత మండిపడుతున్నారు. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. ఆ విషయంపై క్యాడర్కూ అవగాహన ఉంది.