ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్న ఎంపీల రాజీనామా అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని డిసైడ్ చేశారు! అయితే, ఇప్పటికిప్పుడు కాదు… ఏప్రిల్ 5 వరకూ సమయం ఉంది. వచ్చే నెల 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. దాన్లో వైకాపా ఎంపీలు ఆందోళన చేస్తారు. వివిధ మార్గాల ద్వారా పోరాటం చేసేందుకు ఇప్పటికే ఓ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. అవన్నీ పూర్తయ్యాక… అప్పటికీ కేంద్రంలో కదలిక రాకపోతే, బడ్జెట్ సమావేశాలు ముగిసిన మర్నాడే, అంటే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ ప్రకటించారు. నిజానికి, ఈ నిర్ణయం మొన్నటి భేటీలోనే జగన్ తీసుకున్నారట. కాకపోతే, తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారట.
వైకాపా ఎంపీలు ఏ పాయింట్ ను మీద రాజీనామాల కోసం సిద్ధమౌతున్నారంటే.. ‘ప్రత్యేక హోదా సాధన! హోదా ఆంధ్రుల హక్కు అని జగన్ నినదిస్తున్నారు. కానీ, స్వప్రయోజనాల కోసం, ప్యాకేజీల కోసం హోదాను చంద్రబాబు దీన్ని వదులుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైకాపా కట్టుబడి ఉందనీ, అందుకే హోదా సాధన కోసం పదవుల్ని వదులుకోవడానికి ఎంపీలు సిద్ధమౌతున్నారని ప్రకటించారు. నిజానికి, ఎంపీల రాజీనామా అంశం చాన్నాళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 6 అంటున్నారు. సరే, ఇంతకీ ఎంపీలు రాజీనామా చేస్తున్నది కేవలం ‘ప్రత్యేక హోదా సాధన’ కోసం మాత్రమే! అంతేతప్ప, ప్రస్తుతం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన కేటాయింపుల సాధన కోసం అని అనడం లేదు.
వాస్తవంగా మాట్లాడుకుంటే.. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పుడు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రం స్పందించే అవకాశం ఉండదన్నది చాలా స్పష్టం. దానికి బదులుగానే కదా ప్యాకేజీ ఇచ్చామని చెప్పింది. ఇప్పుడు ఆంధ్రా సాధించుకోగలిగేది ఏదైనా ఉందంటే.. ఆ ప్యాకేజీలోని కేటాయింపుల్నే. అంతేగానీ, ఇవన్నీ వద్దు.. మాకు ప్రత్యేక హోదా ఇచ్చేయండీ అంటే.. ఏమీ జరగదక్కడ. ఒకవేళ ఆంధ్రాకు హోదా వస్తుందన్న అవకాశం ఉంటే.. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీయే ఈ పాటికి ఆందోళన చేసేది. విభజనతో ఏపీలో బాగా దెబ్బ తిన్నది వారే కదా! కాబట్టి, కనీసం హోదా సాధన సాధ్యమని తెలిస్తే వారు మాత్రం ఆ అవకాశాన్ని ఇన్నాళ్లూ ఎందుకు వదులుకుంటారు..? అయినా, రాజకీయంగా చూసుకున్నా భాజపాకిగానీ, కాంగ్రెస్ కిగానీ ఆంధ్రాపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు.
కాబట్టి, ఇప్పుడు కేంద్రం ఇస్తామంటున్న కేటాయింపులు సాధించుకోవడానికే పోరాటం చేయాలి. వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి పెంచాలి. అంతేగానీ, ఏదైమేనా మాకు హోదా మాత్రమే కావాలంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఇప్పుడు వైకాపా ఎంపీలు చేయబోతున్న రాజీనామాలు వారికి కొంత పొలిటికల్ మైలేజ్ ఇవ్వగలుగుతాయేమోగానీ… కేంద్రంలోని భాజపాను ప్రభావితం చేయడం అనేది అనుమానమే..! ప్రత్యేక హోదా కోసం బాగా పోరాడుతున్నాం అని తమ పోరాట పటిమను ఏపీలో చాటి చెప్పుకోవడానికి ఈ రాజీనామాలు పనికొస్తాయేమోగానీ… ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఇదొక్కటే మార్గం అనుకోవడమూ సరైందని కాదనే చెప్పాలి. ఇప్పటికి కూడా.. హోదాని చంద్రబాబు సాధించలేకపోయారు, చంద్రబాబు తాకట్టు పెట్టేశారు అనే కోణం నుంచే వైకాపా పోరాటం ఉంటోంది. అంతేగానీ, కేంద్రం ఇవ్వలేదూ, ఇచ్చిన మాటను భాజపా తప్పిందనే కోణం జోలికి జగన్ వెళ్లడం లేదు.
ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాల్సిన విషయం ఏంటంటే… ‘వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయడాన్ని ఎవ్వరూ తప్పుబట్టడం లేదు’. చేయనంత కాలం చేయలేదనీ, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక కామెంట్ చేయాలన్నది ఉద్దేశం కానే కాదు. ఎప్పుడైనా రాజీనామా చేసే హక్కు, ఇప్పుడే చేయాల్సిన అవసరం వారికి ఉన్నాయి. కానీ, రాష్ట్ర ప్రస్తుత ప్రయోజనాలు ఈ రాజీనామాలకు ప్రాతిపదిక అయి ఉంటే బాగుండేది అనేది మాత్రమే ఇక్కడ పాయింట్. రాని హోదా కోసమే రాజీనామాలు అనడం వెనక వైకాపా రాజకీయ ప్రయోజనం మాత్రమే కనిపిస్తోంది.