ప్రపంచంలో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశాల మధ్య దాడులకు కారణం అవుతున్నాయి. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఆయా దేశాల్లో ఏళ్ల తరబడి కష్టించి నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. కానీ ఆ యుద్ధాల వల్ల ఏం సాధిస్తున్నారు అంటే.. ఒక్కటి కూడా చెప్పలేరు. పోనీ తాము యుద్ధం చేసిన దేశాన్ని ఓడించారా అంటే.. ఈ కాలంలో ఓ దేశాన్ని ఓడించడం అనే కాన్సెప్ట్కు అర్థం లేదు. ఆ దేశాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలి. కానీ అది అసాధ్యం.
ఇజ్రాయెల్, ఇరాన్ ఏం సాధించాయి ?
ఇరాన్ ప్రపంచదేశాలు ఆందోళనలను పక్కన పెట్టి .. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి అణుకార్యక్రమం చేపట్టింది. వాటిని నియంత్రించడానికి ఇజ్రాయెల్, అమెరికా రంగంలోకి దిగాయి. దాడులు చేశాయి. ఇరాన్ ప్రతి దాడులు చేసింది. దీని వల్ల ఇరాన్ ఎక్కువగా నష్టపోయింది. ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయింది. పెద్దన్న అమెరికాకూ ఓ లెంపకాయ పడింది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అందరిపై ఆ ప్రభావం కనిపించింది. చివరికి ఈ యుద్ధానికి పరిష్కారం ఏమిటో తెలియకుండానే.. కాల్పుల విరమణ పాటించారు. అర్థం లేని యుద్ధానికి జరిగిన నష్టానికి బాధ్యులెవరు ?
రష్యా – ఉక్రెయిన్ సుదీర్ఘ యుద్ధం – వేల ప్రాణాలు బలి
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సుదీర్ఘంగా సాగుతోంది. నెలల తరబడి బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్ వద్ద బాంబులు అయిపోతే నాటు దేశాలు ఇస్తున్నాయి. రష్యా సమయం చూసి ఉక్రెయిన్ పై బాంబులు వేస్తూనే ఉంది. అసలు ఈ యుద్ధానికి పరిష్కారం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఈ యుద్ధం వల్ల రెండుదేశాల్లో వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షల కోట్ల మౌలిక సదుపాయాలు నాశనం అయ్యాయి. ఇంకా కాల్పుల విరమణ కూడా పాటించలేదు. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలకూ నష్టమే. ఎప్పటికీ పరిష్కారం లభించదు. కానీ నష్టం మాత్రం..దశాబ్దాల పాటు పూడ్చుకోలేనిదిగా ఉంటుంది.
త్వరగానే తెలుసుకున్న భారత్ – పాక్
యుద్ధానికి దగ్గరగా వెళ్లి భారత్, పాకిస్తాన్ త్వరగానే తెలుసుకున్నాయి. ఉగ్రవాదులపై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ ను వ్యతిరేకించిన పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడులకు.. ఆ దేశం చాలా సైనిక నష్టాలను చూసింది. భారత్ కూ నష్టం జరిగింది. ఆ నష్టం ప్రజల వరకూ వెళ్లకుండా.. చాలా వేగంగా కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చాయి. దాంతో పరిమితమైన నష్టంతోనే బయటపడ్డాయి.
యుద్ధం ఎప్పటికీ.. ఎలాంటి సమస్యలను పరిష్కరించలేదు. కానీ విధ్వంసానికి కారణం అవుతుంది. అందుకే ప్రపంచ దేశాలు.. స్వార్థంతో కాకుండా.. కాస్త విశాల భావనతో వ్యవహరిస్తే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోతాయి.