పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత కేసీఆర్ ఇంత వరకూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రజల ఇబ్బందులు తొలగించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందంటూ ఆయన గురువారం మోడీకి ఫోన్ చేసి చెప్పారు.
నోట్ల మార్పిడి కోసం ప్రజల ఇబ్బందులు, మార్కెట్ యార్డుల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను మోడీకి కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని జాగ్రత్తలను యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని సూచించారు. అయితే స్వయంగా ఆ అంశాలను వివరించాలని కేసీఆర్ ను మోడీ కోరినట్టు తెరాస వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. తనకు ముందుగా ఖరారైన షెడ్యూల్స్ మధ్యలో వీలునుబట్టి తన కార్యాలయానికి ఆహ్వానిస్తానని మోడీ చెప్పారట. తనకు అందుబాటులో ఉండాలని సూచించారట.
ప్రధానిని కలిసినప్పుడు సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మౌఖికంగా మోడీకి విషయాన్ని వివరించడంతో పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇవ్వవచ్చని తెరాస వర్గాల కథనం.
కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు చాలా మంది మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి కామెంట్ చేయలేదు. నిర్ణయంపై వ్యాఖ్యానించడం కంటే ప్రజల కష్టాలను తొలగించడం ముఖ్యమనేది ఆయన ఉద్దేశం. ఎలాగూ నిర్ణయం జరిగిపోయింది. చాలా పాతనోట్లను మార్చుకున్నారు. ఈ దశలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కాబట్టి వాస్తవిక దృష్టితో వ్యవహరించాలనేది కేసీఆర్ ఉద్దేశం. ఆ దిశగానే మోడీతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.