కేరళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల మధ్య కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. పది రోజుల నుంచి జరిగిన కసరత్తుకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ముఖ్యమంత్రి పీఠం కోసం బలమైన పోటీదారులుగా ఉన్న సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వీడీ సతీషన్ పేర్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్న సతీషన్ వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపారు.
కేసీ వేణుగోపాల్ను గనుక ముఖ్యమంత్రిని చేస్తే పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధిష్టానం భావించింది. పార్టీలో అంతర్గత తిరుగుబాటు వచ్చే అవకాశాన్ని ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న సతీషన్కే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కేసీ వేణుగోపాల్కు వ్యతిరేకంగా మలప్పురం నుంచి తిరువనంతపురం వరకు ఉన్న పలువురు స్థానిక నాయకులు గళమెత్తడంతో అధిష్టానం అప్రమత్తమైంది. సతీషన్ నాయకత్వంలోనే పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండగలవని, అలాగే ఇటీవల జరిగిన పోరాటాల్లో ఆయన చూపిన చొరవ పార్టీ విజయానికి దోహదం చేసిందని రాహుల్ గాంధీ తన నిర్ణయంలో పేర్కొన్నట్లు సమాచారం.
సతీశన్ ఎంపిక ద్వారా కేరళ కాంగ్రెస్లో కొత్త తరం నాయకత్వానికి తెరలేచింది. కేసీ వేణుగోపాల్ను ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ రాజకీయాలకే పరిమితం చేసి, రాష్ట్ర పాలనా బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించడం ద్వారా పార్టీని ఐక్యంగా ఉంచుకోవాలని పార్టీ భావిస్తోంది. సతీషన్ ఎంపిక పట్ల అటు పార్టీ శ్రేణులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సానుకూల స్పందన లభిస్తోంది. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్లు జాతీయ స్థాయిలో కీలకంగా ఉంటూనే, రాష్ట్రంలో సతీషన్ నేతృత్వంలో ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో కేరళ కాంగ్రెస్లో ఎన్నాళ్లుగానో ఉన్న వర్గపోరుకు తాత్కాలికంగానైనా తెరపడుతుందని అనుకోవచ్చు.