‘పెద్ది’ రిలీజ్ కు ముందు జరుగుతున్న గలాటాని మెగా అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఇదంతా తమ హీరోలపై జరుగుతున్న కుట్ర అని వాళ్లెప్పుడో డిసైడ్ అయిపోయారు. నిన్నటి నిర్మాతల ప్రెస్ మీట్ లోనూ… ఇదే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సింగిల్ థియేటర్లపై ఇన్నాళ్లూ లేని ప్రేమని ఇప్పుడే ఎందుకు ఒలకబోశారు? అనేది నిర్మాతల సూటి ప్రశ్న. `పెద్ది`ని ఏదోరకంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది వాళ్ల ఆరోపణ.
ఎగ్జిబీటర్ల మీటింగ్ లో దిల్ రాజు లేకపోయినా, ఆయన స్వరం మాత్రం శిరీష్ రూపంలో గట్టిగానే వినిపించింది. దిల్ రాజు చేతిలో పెద్ద సినిమాలు ఇప్పుడు లేవు కాబట్టి, ఆయన
‘పెద్ది’ ని టార్గెట్ చేసి, ఎగ్జిబీటర్ గా లాభపడాలని చూస్తున్నారు. ఇది చరణ్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. వాళ్ళంతా ‘గేమ్ ఛేంజర్’ రోజుల్ని గుర్తు చేస్తున్నారు.
శంకర్ కి అడ్వాన్స్ ఇచ్చి, ఆ అడ్వాన్స్ ని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో, రామ్ చరణ్ డేట్లు సంపాదించి, కాంబో చూపించి, బిజినెస్ చేసుకొని, ఏదోలా గట్టెక్కాలని దిల్ రాజు భావించారని, ఆ సమయంలో దిల్ రాజుకి చరణ్ అండగా నిలిచారని, ఆర్.ఆర్.ఆర్ తరవాత శంకర్ డైరెక్షన్లో చరణ్ సినిమా చేయడమే ఎక్కువని, అయినా దిల్ రాజు ఆ రోజుల్ని మర్చిపోయారన్న విషయాన్ని చరణ్ ఫ్యాన్స్ పాత రోజుల్లోకి వెళ్తున్నారు.
సినిమా ఫ్లాప్ అయినప్పుడు.. చరణ్ తన పారితోషికాన్ని వదులుకొన్నారని, దిల్ రాజు కూడా అప్పట్లో చరణ్ స్థాయికి తగిన రెమ్యునరేషన్ ఆఫర్ చేయలేదని, అయినా సరే.. చరణ్ అవన్నీ పట్టించుకోలేదని, సినిమా ఫ్లాప్ అయిన తరవాత శిరీష్ ఓ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చి, చరణ్ పై డామేజింగ్ కామెంట్లు చేశారని, అయినా చరణ్ రియాక్ట్ అవ్వలేదని, అలాంటి హీరో సినిమా వస్తున్నప్పుడు తెర వెనుక ఉంటూ ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందని చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
దిల్ రాజు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఇండస్ట్రీలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పంచాయితీ ఏదో సంక్రాంతి సమయంలో ఎందుకు పెట్టలేదంటూ నిలదీస్తున్నారు. అప్పట్లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు దిల్ రాజు డిస్టిబ్యూటర్. అందుకే ఆయన అప్పట్లో కామ్ గా ఉన్నారని, ఇప్పుడు చేతిలో పెద్ద సినిమా లేదు కాబట్టి ప్రతాపం చూపిస్తున్నారన్నది వాళ్ల మాట. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటి వరకూ దిల్ రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మీడియా ముందుకు ఎప్పుడొస్తారో చూడాలి.


