అవగాహన రాహిత్యమో లేక స్వయంకృతమో గానీ తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ ఓ సమస్యగా మారినట్టుంది. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు మామూలైపోయాయి. కోర్టుల్లోనూ ప్రభుత్వ ఉత్తర్వులపై ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క మల్లన్న సాగర్ మాత్రమే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం ఎమర్జెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అందులో చేర్చిన భూములను స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టంలోని సెక్షన్ 6(2), సెక్షన్ 10, సెక్షన్ 40 కింద భూసేకరణ చేయాలని తలపెట్టడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. సోషల్ ఇంపాక్ట్, ఇతర ప్రభావాలపై అధ్యయనం లేకుండా భూసేకరణ చేస్తున్నారని పిటిషనర్ వాదించారు.
నిజానికి జాతి భద్రత కోణంలో సైనిక అవసరాల కోసం, పెను విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఈ అధ్యయనం లేకుండా భూసేకరణ చేయవచ్చు. అయితే ప్రాజెక్టుల విషయంలో అంత అత్యవసర పరిస్థితి ఏమి ఉంటుందని పిటిషనర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఈ నిబంధన విషయంలో కోర్టు సంతృప్తి చెందితేనే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు భూములను స్వాధీనం చేసుకోరాదని ఆదేశించింది.
ఇటీవల మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణను 123 జీవో ప్రకారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా వివాదాస్పదమైంది. పలువురు రైతులు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. చివరికి కోర్టులోనూ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు సూచనల ప్రకారం మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ విషయంలో పకడ్బందీ ప్రణాళిక లేకుండా ముందుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు.