బురద చల్లేసి దాక్కునే వైసీపీ రాజకీయాలకు నారా లోకేష్ సరైన విధంగా చెక్ పెట్టబోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి.. ఓ అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం అని నమ్మించాలనుకుంటున్నారు. అందరూ నమ్మకపోవచ్చు కానీ.. చంద్రబాబును, టీడీపీని ద్వేషించే వాళ్లు అయినా నమ్ముతారని వైసీపీ ఈ ఫేక్ వార్తల్ని వండి వారుస్తోంది. ఇంత కాలం సహించినా ఇప్పుడు నారా లోకేష్ మాత్రం ఇది రాజకీయమే అని అనుకోవడానికి సిద్ధంగా లేరు. తప్పుడు ఆరోపణలు, ప్రచారాలకు సరైన విధంగా షాక్ ఇవ్వబోతున్నారు.
లోకేష్పై పదే పదే ఆధారాలు లేని ఆరోపణలు
తల్లికి వందనం స్కీమ్లో రూ. రెండు వేలు లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను నారా లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ పెట్టారు. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. గతంలోనూ వైసీపీ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడు నారా లోకేష్ సవాల్ చేశారు. కానీ అప్పుడు కూడా వైసీపీ ఏ ఆధారాలు సమర్పించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహం పాటిస్తోంది. దాంతో నారా లోకేష్ ఇక .. చట్టపరమైన చర్యలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి తల్లికి వందనం స్కీమ్పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కనీస ఆధారాలు లేకుండా బురద చల్లడమే వైసీపీ రాజకీయం
జగన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేశారని టీడీపీ నేతలు ఆధారాలతో ఆరోపణలు చేసేవారు. లిక్కర్ స్కాం నుంచి ఇసుక వరకూ .. ఆయన బంధువులు ఎలా దోపిడీ చేసేవారో వివరించేవారు. కానీ నారా లోకేష్ పై ఎల్ ట్యాక్స్ అని.., పథకంలో రెండు వేలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కనీసం సిమిలర్ గా ఉండే ఆధారం బయట పెట్టినా.. కాస్త లాజికల్ గా ఉండేది. ఏదీ పెట్టలేదు. అసలు వైసీపీ హయాంలోనూ రెండు వేలు స్కూల్ మెయిన్టెనెన్స్ కోసం తీసుకున్నారు. ఆ డబ్బులు జగన్ ఖాతాలోకి వెళ్లాయా అని ప్రశ్నిస్తారన్న ఇంగితం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ బురదజల్లుడు రాజకీయానికి బ్రేక్ పెట్టాలని నిర్ణయించారు.
న్యాయపరమైన చర్యలు షురూ
నారా లోకేష్ .. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా మందిపై కోర్టుల్లో కేసులు వేశారు. అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలపై భారీగా కేసులు వేయబోతున్నారు. కనీస ఆధారాలు చూపించకుండా.. రాజకీయ ఆరోపణలు మాత్రమే అని సమర్థించుకుంటే.. వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలిసేలా చేయబోతున్నారు.