పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు. వాటిని భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తోంది. దాడుల విషయంలో అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని.. ఈ విషయంలో భారత్ పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇప్పటి వరకూ నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్ కే అని చెప్పినా.. భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి.. ఈ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు.
చైనా పాకిస్తాన్ కు మద్దతివ్వగలదు కానీ.. భారత్ పై దాడికి సిద్ధమయ్యే అవకాశం లేదు. అదే జరిగితే చైనా కూడా అంత కంటే ఎక్కువ దెబ్బతింటుంది. అలాంటి రిస్క్ తీసుకోలేదు. ఉగ్రక్యాంపులపై దాడులు చేయడానికి ముందే… భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే.. అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే.. పాకిస్తాన్ పైనే ప్రపంచదేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి.