ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీల్లో కీలకమైంది విశాఖ రైల్వే జోన్. గడచిన నాలుగేళ్లుగా దీనిపై భాజపా సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో ఇచ్చేస్తామనీ, దానిపైనే ఆలోచిస్తున్నామనీ, ప్రకటన ఒక్కట మిగులుందని… ఇలా చాలా కథలు చెప్పుకుంటూ కాలయాపన చేశారు. అయితే, ఈ మధ్య కేంద్రంపై టీడీపీ సర్కారు ఒత్తిడి పెంచడంతో రైల్వోజోన్ పై కూడా కొంత కదలిక కనిపించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారనీ, ఆంధ్రాకు అనుకూలమైన ప్రకటన ఉంటుందని కేంద్రం తాజాగా చెప్పింది. ఏపీ రైల్వేజోన్ కు ఉన్న ఒకే ఒక ప్రతిబంధకం.. ఒడిశా అభ్యంతరం! విశాఖకు జోన్ ఇస్తే భువనేశ్వర్ ఆదాయం తగ్గిపోతుందన్నది ఆ రాష్ట్ర నేతల అభిప్రాయం. పైగా, భాజపా అధికారంలోకి రావాలని ఆశిస్తున్న రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఉంది కాబట్టి, అక్కడి ప్రజలను నొప్పించకుండా ఉండేందుకు ఏపీ రైల్వేజోన్ ను అనిశ్చితిలో పడేశారు. ఇప్పుడు ఒడిశాతో ఒప్పించి… ఆంధ్రా పరిధిలోని ప్రాంతాలను మాత్రమే కలుపుతూ జోన్ ఏర్పాటు ప్రతిపాదన తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో విశాఖ రైల్వేజోన్ కి లైన్ క్లియర్ అయిపోయిందనుకుంటే పొరపాటే! ఎందుకంటే, ఆంధ్రా రైల్వేజోన్ విశాఖకే ఎందుకూ.. విజయవాడకు ఇస్తే సరిపోతుంది కదా అనే ప్రతిపాదన మరోసారి కేంద్ర పరిశీలనలో ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఈ హామీపై మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అప్పట్లో ఆ కమిటీ తేల్చింది ఏంటంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు అవకాశాలు తక్కువగా ఉన్నాయని! ఇదే విషయాన్ని ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు కూడా చెప్పారు. అయినాసరే, విశాఖ జోన్ ఏర్పాటు కోసమే కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు. రైల్వేమంత్రిగా సురేష్ ప్రభు ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా జోన్ ఇచ్చేద్దామనే నిర్ణయానికి కేంద్రం వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది విశాఖ ప్రాంత నేతలు, వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఏదో ఒక సర్దుబాటు చేసి ఆంధ్రాకి ఒక జోన్ ఇచ్చేస్తే పనైపోతుందన్న అభిప్రాయంతో ఇప్పుడు కేంద్రం ఉంది. విశాఖ జోన్ ఏర్పాటును ఒడిశా నేతలు వ్యతిరేకిస్తున్నారు. భువనేశ్వర్ జోన్ నుంచి విశాఖను వదలుకోవడానికే వారు తటపటాయిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని దక్షిణ కోస్తాకు చెందిన ఎంపీలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైల్వేజోన్ ను విజయవాడకు కేటాయించినా ఓకే అన్నట్టుగా ప్రయత్నాలు సాగిస్తున్నారట! ఈ లాబీయింగ్ ఎలా పనిచేస్తుందో తెలీదు. కానీ, రైల్వేజోన్ అనేది విశాఖ ప్రాంత వాసులకు ఒక సెంటిమెంట్ అంశంగా మారిపోయిన సంగతి తెలిసిందే. విశాఖను కాదని, విజయవాడకి జోన్ ఇస్తే… అదో సమస్యగా మారడం ఖాయం. విశాఖ ప్రాంత ప్రజల సెంటిమెంట్ కేంద్రానికి అనవసరమైన అంశమే కావొచ్చు, కానీ, లాబీయింగ్ చేస్తున్న సదరు నేతలు అర్థం చేసుకోలేని విషయమైతే కాదు కదా!