అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమెకు కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్షా కాలం జనవరి 27తో ముగియనుంది. నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. పది కోట్ల జరిమానాను కోర్టు విధించింది. ఆ జరిమానాను శశికళ కోర్టులో జమ చేసింది. ఒక వేళ రూ. పది కోట్లు చెల్లించకపోతే.. మరో ఏడాది జైల్లో ఉండాల్సి వస్తుంది. కానీ చెల్లించేసినందున.. ఆమె జనవరి ఇరవై ఏడో తేదీన విడుదలవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగానే భావించాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. శశికళ విడుదల కావడం.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకు రావడం ఖాయమే.
శశికళ విడుదలైతే నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకేలో కల్లోలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి.. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోటీ నడుస్తోంది. చివరికి బీజేపీ జోక్యంతో పళనిస్వామినే సీఎం అభ్యర్థిగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ.. పన్నీర్ సెల్వం ఇప్పటికి వెనక్కి తగ్గినా.. తర్వాత మాత్రం తన వర్గంతో విరుచుకుపడే అవకాశం ఉంది. జయలలిత చనిపోయినప్పుడు పన్నీర్ సెల్వంను సీఎంను చేశారు. తర్వాత శశికళ ఆ పదవి దక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమె జైలుకెళ్లారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో పళని స్వామి .. శశికళ మద్దతుతో సీఎం అయ్యారు.
తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. పన్నీర్ను తర్వాత సమాధాన పరిచిన బీజేపీ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇప్పించింది. శశికళను.. ఆయన వర్గాన్ని పార్టీ నుంచి పంపేశారు. దినకరన్ సొంత పార్టీ పెట్టుకుని ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఫెయిలయ్యారు. ఒక వేళ ఆమె బయటకు వస్తే..మళ్లీ అన్నాడీఎంకే క్యాడర్ మొత్తం ఆమె వెంట పోతుందన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే.. అంతో ఇంతో ఆమె చరిష్మా ఉన్న నాయకురాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తమిళనాడులో రాజకీయ కంపం ఖాయంగా కనిపిస్తోంది.