గడచిన రెండ్రోజులుగా భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వరుసగా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. శుక్రవారం కర్నూలులో మాట్లాడితే, శనివారం కడపలో మాట్లాడారు! తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల తాము చిత్ర హింసలు అనుభవించామని సోము వీర్రాజు తాజాగా ఆరోపించారు. టీడీపీతో ఇంకా పొత్తు కొనసాగి ఉంటే, తమకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం ఉండేది కాదని వాపోయారు! ముఖ్యమంత్రి డాష్ బోర్డుపై ఎద్దేవా చేశారు. ఆయన దగ్గర అంతా తొంబై తొమ్మిది శాతం బాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుందనీ, కానీ క్షేత్రస్థాయిలే ఏదీ సరిగా ఉండదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అంతా అవినీతిమయం అని అన్నారు. రాయలసీమ ప్రాంతంపై ముఖ్యమంత్రి సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. పోలవరం సోమవారం అని చంద్రబాబు చెప్పనక్కర్లేదనీ, ఎందుకంటే అది కేంద్రం నిధులతో నిర్మించే ప్రాజెక్టు అన్నారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును రాష్ట్ర నిధులతో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయానికి వచ్చేసరికి… దీనిపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని మాత్రమే చెప్పారు.
నిన్న కర్నూలులో కూడా సోము వీర్రాజు మాట్లాడిన సంగతి తెలిసిందే. అభివృద్ధిని అమరావతి ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారన్నారు. రాయలసీమ ప్రజలు బానిసలా, ఈ ప్రాంతానికి వచ్చే పరిశ్రమలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, కడపల్లో ఆయన స్థూలంగా తెరమీదికి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్న అంశం ఏంటంటే… రాయలసీమ ప్రాంతాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది అనేది..! అంతేకాదు, సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు బానిసలా అని అనడమూ గమనార్హం.
కొద్దిరోజుల కిందట భాజపా నేతలు కర్నూలులో ఓ సమావేశం ఏర్పాటు చేసి.. రెండో రాజధాని ఇక్కడ పెట్టాలి, హైకోర్టు ఇక్కడే కట్టాలి, రాజ్ భవన్ ఇక్కడికే తేవాలి.. ఇలాంటి డిమాండ్లతో ఓ డిక్లరేషన్ విడుదల చేశారు. రాష్ట్రమంతా ఐకమత్యంగా కేంద్రంపై నిరసన గళం వ్యక్తమౌతుంటే.. ఇలా ప్రాంతాలవారీగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాజపా ఉందనేది ఆ సమయంలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు సోము వీర్రాజు కూడా ఆ అజెండానే మళ్లీ తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర అంటూ ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది..!