తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా అద్భుతమైన రాజకీయ ప్రయాణాన్ని చూస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఒకసారి గెలిచి ఉండవచ్చు..మరోసారి ఓడిపోయి ఉండవచ్చు .. ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు.. కానీ 1983 లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి విశ్లేషిస్తే భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న పార్టీ టీడీపీ. ప్రారంభం నుంచి దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు మరో తరం దిశగా ఘనమైన ప్రయాణం చేయబోతోంది.
టీడీపీకి భవిష్యత్ నాయకత్వాన్ని అందించనున్న కడప మహానాడు
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మహానాడు జోష్ కనిపిస్తోంది. కడపలో మూడు రోజుల పాటు మహానాడును నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్నారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రతీ సారి రెండు రోజులు నిర్వహిస్తారు. ఈ సారి కడపలో మూడు రోజుల పాటు ప్లాన్ చేశారు. చివరి రోజు బహిరంగసభ నిర్వహిస్తారు. ఈ మహానాడు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. టీడీపీకి భవిష్యత్ నాయకత్వాన్ని ఈ మహానాడు అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రజలు ఓన్ చేసుకున్న ప్రాంతీయ పార్టీ టీడీపీ
ఓ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా కుటుంబ పార్టీగానే ఉంటుంది. ఆ కుటుంబం పరపతి తగ్గిపోతే ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతుంది. భారత రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. కానీ కుటుంబం పిల్లర్ గా ఉన్నప్పటికీ.. ప్రజల్లోకి వెళ్లిపోయి ఇది మా పార్టీ అనే భావన కలిగించిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ పార్టీ పెట్టినా..చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మరో తరం ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. నారా లోకేష్ .. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దానికి ఆయన సమర్థుడు కూడా. భవిష్యత్ పార్టీ వ్యూహాల్లో ఆ నిర్ణయం అత్యంత కీలకం కూడా.
యువ నేతల రాజకీయానికి మహా మార్గం
ఇప్పటికే టీడీపీలో మరో తరం కీలకంగా మారింది. పాత తరం వెనుకడుగు వేసింది. కొత్త తరం దూకుడుగా ముందుకు వచ్చింది. గత ఎన్నికల్లో యువతరం ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేశారు. రాబోయే తరానికి వారసులు, ప్రజల నుంచి వచ్చిన వారు తమదైన ముద్రవేసేందుకు రెడీ అయ్యారు. వీరంతా టీడీపీకి భవిష్యత్ లాంటి వారు. ఇప్పుడు వారికి బాధ్యతలు ఇస్తే.. వచ్చే కొద్ది నెలల్లో పార్టీకి అంతా తామై అల్లుకుపోతారు. దానికి ఈ మహానాడు వేదిక కానుంది. కడప వేదికగా టీడీపీ మరో తరం దిశగా మహా ప్రయాణానికి రెడీ అవుతోంది.