నిఖిల్ అంటే…. మన స్వామి రా రా నిఖిల్ కాదు. జాగ్వార్ హీరో నిఖిల్. దేవగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు ఈ నిఖిల్. తాను కథానాయకుడిగా నటించిన జాగ్వార్ త్వరలోనే విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం రూ.70 కోట్లకు పైచిలుకు ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ కూడా అదే రేంజులో చేయడం చర్చనీయాంశమైంది. నిఖిల్ రెండో సినిమా కోసం కూడా అప్పుడే వేట మొదలైంది. ఈసారి టాలీవుడ్ టాప్ దర్శకుడి చేతిలో నిఖిల్ని పెట్టడానికి కుమారస్వామి తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే టాలీవుడ్లో టాప్ దర్శకులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కొరటాల శివలతో చర్చించినట్టు కుమారస్వామి తెలిపారు. రెండో సినిమా కచ్చితంగా ఓ అగ్ర దర్శకుడితో ఉండబోతోందని వచ్చే యేడాది దానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
పవన్తో కూడా ఓ సినిమా ఉంటుందని, అందుకు పవన్ అంగీకరించారని, పవన్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమతో ఓ సినిమా చేస్తారని కుమారస్వామి ప్రకటించారు. అంతేకాదు.. త్వరలోనే జగపతిబాబు హీరోగా ఓ సినిమా మొదలెడతారట. అందుకు సంబంధించిన కథ కూడా రెడీ అయిపోయిందని చెప్పారు. లెజెండ్ తరవాత విలన్ పాత్రలకు ఫిష్ట్ అయిపోయిన జగ్గూభాయ్ జాగ్వార్లో ఓ కీలక పాత్ర చేశారు. విలన్గా టర్న్ అయ్యాక… జగ్గూభాయ్ మళ్లీ హీరోగా చేసే తొలి చిత్రం ఇదే. మొత్తానికి కుమార స్వామి టాలీవుడ్లో పాతుకు పోవడానికి. తనయుడికి లైన్ క్లియర్ చేయడానికి బాగానే కష్టపడుతున్నట్టు అర్థమవుతోంది.