ఎట్టకేలకు హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తోంది. ఈ రోజే ‘జిగడ్తాండ’ రీమేక్ అధికారికంగా మొదలైంది. ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టుకున్నాడు హరీష్. దబాంగ్ ని తెలుగులో రీమేక్ చేసినప్పుడు… కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేశాడు హరీష్. పవన్ కల్యాణ్ స్టైల్కి తగ్గట్టుగా కథ మలచుకున్నాడు. అసలు అది దబాంగ్ రీమేక్ అనే సంగతే మర్చిపోయేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ‘జిగడ్తాండ’ విషయంలోనూ అలాంటి మార్పులే కావాలి. జిగడ్తాండ అంటే ఓ పానియం పేరు. దాన్ని ‘వాల్మీకి’గా మార్చాడు హరీష్. తన మార్పులు ఇక్కడి నుంచే మొదలయ్యాయన్నమాట. బాబీ సింహా వేసిన పాత్రని వరుణ్తేజ్కి అప్పగించాడు. నిజంగా ఇది మరో మంచి ఎత్తు. ప్రతినాయకుడిగా వరుణ్తేజ్ని చూడబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ని తీసుకొచ్చి… టెక్నికల్గా ఈ సినిమా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకున్నాడు. మొత్తానికి ప్యాకేజీ మాత్రం అదిరింది. కావల్సినంత ప్రతిభ ఉన్నా.. సరైన రీతిలో దాన్ని ప్రాజెక్ట్ చేయలేక చతికిల పడుతున్న హరీష్కి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. రాసుకున్న కథలు వర్కవుట్ కానప్పుడు, రీమేక్ కథలే దారి చూపిస్తాయి. ఇప్పుడు హరీష్ విషయంలో అదే జరుగుతోంది. దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్గా తీసి హిట్టుకొట్టిన హరీష్.. ఇప్పుడు జిగడ్తాండని ఏం చేస్తాడో చూడాలి..? ఆ వాల్మీకి రామాయణం రాస్తే… ఈ వాల్మీకి హరీష్ శంకర్ భవిష్యత్తు రాయబోతున్నాడు. అదెలా ఉంటుందో మరి.