హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో రోడ్లను రోడ్లుగా చూడటానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో తెలియడం లేదు. వర్షాకాలం రాకముందే చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు నగరం గుంతల మయంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి స్థాయి వారు ఆదేశించినా జి హెచ్ ఎం సి వారిలో కదలిక లేకపోవడం విశేషం. వానా కాలం తర్వాత రోడ్లు వేయడం, గుంతలు పూడ్చడం వంటి పనులు చేపట్టారు. అవి కూడా శరవేగంగా పూర్తి కావడం లేదని స్వయంగా మంత్రి కేటీఆర్ మరో విధంగా చెప్పారు.
నగరంలో రోడ్లు వేయడానికి, బాగు చేయడానికి 75 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు మంగళవారం ఆయన సమీక్షా సమావేశంలో చెప్పారు. మొత్తం 489 పనులు చేపట్టగా 176 రోడ్ల పనులు పూర్తయినట్టు తెలిపారు. అంటే, కనీసం 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదని పరోక్షంగా ఆయనే చెప్పారు. కేవలం రోడ్లు సరిగా లేక, గుంతలు పూడ్చే దిక్కు లేక ఇప్పటికీ అనేక చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్ల దుస్థితి వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు.
కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయాలి. గుంతలు పూడ్చాలి. ఘనత వహించిన జీహెచ్ ఎంసి అధికారులు గానీ కమిషనర్ గానీ ఎందుకు ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం అడగక పోవడం విస్మయకరం.
పైగా కేటీఆర్ మరో కొత్త పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు. నగరంలో 480 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా వైట్ టాప్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఒకటి రెండూ కాదు, 1275 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యే పని ఇది. వచ్చే వానాకాలంలోగా పూర్తి చేయాల్సిన పనులపైనా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే జిహెచ్ ఎం సి వారు ఇదే వేగంతో పనిచేస్తే ఎన్ని వానాకాలాలు వచ్చిపోయాక పనులు పూర్తవుతాయనేది ప్రశ్న.