దేశంలో కొన్ని వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ అయినా అసాంఘిక శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా వ్యవహరించదు.. ఒక్క వైసీపీ తప్ప. ఆ పార్టీ అధినేత రోడ్డు మీదకు వస్తే డ్రామాలు, ఖూనీలు, ఘోరాలు. దోచుకున్న సొమ్ముతో ఇష్టం వచ్చినట్లుగా పొలిటికల్ షోలు చేయడం.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు శాంతిభద్రతల సమస్యలు తీసుకు రావడం తప్ప.. చేసేదేమీ ఉండదు. ఎప్పుడూ కుట్రల రాజకీయాలు చేయడమే పని.
జగన్ తప్పులకు శిక్షలు ఎప్పుడు ?
జగన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలు చిన్నవి కావు. కానీ ఇప్పటి వరకూ ఆయనపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రఘురామకృష్ణరాజు పట్టుబడితే ఆయనను కొట్టిన కేసులో పేరు చేర్చారు కానీ కనీసం ప్రశ్నించలేదు. జెత్వానీ కేసులో అసలు నిందితుడు. ఇసుక నుంచి లిక్కర్ స్కామ్ వరకూ ప్రధాన లబ్దిదారు ఆయనే. అంతకు మించిన తప్పులకు సాక్ష్యాలు ప్రభుత్వం వద్ద రెడీగా ఉంటాయి. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో జగన్ రెచ్చిపోతున్నారు. ఆయన రాజకీయాలకు అనర్హుడని అంటున్నారు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదు.
సానుభూతి వస్తుందని ఆగుతున్నారా ?
చట్టాలను ఉల్లంఘిస్తున్న జగన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే.. సానుభూతి వస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసును తేల్చడానికీ సిద్ధపడటం లేదు. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది. మరో కోణంలో అయినా కేసును విచారణ జరిపి.. నిజాలను ప్రజల ముందు పెట్టాల్సి ఉంది. కానీ పెట్టలేకపోతున్నారు. ఆ హత్య కేసులో జగన్ రెడ్డికి, భారతి రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉందన్నదానికి సీబీఐ సాక్ష్యాలు బయట పెట్టింది. కానీ వాటిని ఊహాగానాలకే పరిమితం చేశారు. అక్కడ్నుచి విచారణ ముందుకెళ్లకుండా న్యాయస్థానాల ద్వారా అడ్డం పడ్డారు. మాపై నిందలేశారు.. అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూంటారు కానీ నిజాలను ఎందుకు బయట పెట్టనివ్వడం లేదు ?
చర్యలు తీసుకోకపోవడం చేతకానితనమే !
జగన్ రెడ్డి రాక్షసత్వం పై ప్రజలకు స్పష్టత ఉంది. ఆయన చేసిన తప్పులపై ప్రజలకూ అవగాహన ఉంది. ఆయనపై చర్యలు తీసుకుంటే ప్రజలు వ్యతిరేకించరు. సానుభూతి చూపించరు. ఆయన సొంత తల్లి, చెల్లిని గెంటేసినా.. వారిపై ఘోరమైన తప్పుడు ప్రచారాలు చేసినా.. బాబాయ్ హత్యకు కుట్ర పన్నారని తెలిసినా.. కార్యకర్తల్ని తొక్కి చంపుతున్నారని తెలిసినా.. ఆయనను సమర్థించే గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అలాంటి వారి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. చట్టం ప్రకారం … చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలు కూడా చట్టం పవర్ ను తెలుసుకుంటారు. అలా వదిలేస్తే.. మొదటికే మోసం వస్తుంది.