ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య రావణకాష్టంలా రగులుతున్న జల జగడానికి ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరపడానికి కేంద్ర మంద్రి ఉమాభారతి నిర్ణయించారు. ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరం చెప్తోంది. ఇది విభజన చట్టానికి విరుద్ధమని వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వాటా నీటిని ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్తోంది. ఏపీ వాటా వీటిని తాము వాడుకునేది లేదంటోంది.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమతమ వాదనలను వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిల్లో ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యకు ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు నీటికేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, విభజన చట్టంలోని నిబంధనలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వ వాదనలో నిజమెంత అనేది మొదట కేంద్ర మంత్రి ఆరా తీయవచ్చు. ప్రాజెక్టుల ప్రతిపాదిక ఆయకట్టు, నీటి వినయోగంపైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ను వివరణ కోరుతారు. ఆ తర్వాత ఏపీ వాదనలో నిజమెంత అనేది కూడా పరిశీలిస్తారు. తమ అభ్యంతరాలు ఏమిటనేది చంద్రబాబు సవివరంగానే చెప్తారు. అప్పుడు ఎవరి వాదన సరైంది, ఏ ప్రాజెక్టు చట్ట వ్యతిరేమైంది అనేదానిపై కేంద్రం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
ఇది చాలా సున్నితమైన అంశం. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధుల కోసం అంటోంది కేసీఆర్ ప్రభుత్వం. అయినంత మాత్రాన విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వాస్తవిక అంశాలతో పాటు భావోద్వేగాలు ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం.