ఉద్యోగుల సమ్మె విషయంలో బిందాస్గా ఉన్న ప్రభుత్వం చర్చల కోసం రోజూ వచ్చి పోతున్నామని వారే రావడం లేదని ఆరోపణలు చేస్తోంది. జీతాలు బిల్లులు ప్రాసెస్ చేయకపోవడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతోందన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి సిద్ధమైందన్న అనుమానం ఉద్యోగ నేతల్లో ఉంది.
జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులను ఉద్యోగులు రెడీ చేయలేదు. డెడ్లైన్ ముగిసే సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారయ్యాయి. మొత్తం 4.50 లక్షల బిల్లులు రెడీ చేయాల్సి ఉంది. ఈ కొద్దిగా కూడా ట్రెజరీ అధికారులపై జిల్లాల్లో కలెక్టర్లు ఒత్తిడి చేయడంతోనే సాధ్యమయింది. ఉద్యోగసంఘాలు చర్చకు రావడం లేదంటూ మంత్రులు పదేపదే చెబుతున్నారు. ఇంకేం మార్గం ఉందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి..లేదంటే చట్టం తన పనితాను చేసుకుపోతుందని మంత్రి బొత్స హెచ్చరించడంతో ఎస్మా అంశం తెరపైకి వచ్చింది.
ఉద్యోగ సంఘం నేతలు కూడా తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే ప్రభుత్వం ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవచ్చు. 14 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎస్మావంటి చట్ట ప్రయోగం ఎంత వరకు సాధ్యమవుతుందని చర్చ సాగుతోంది. కానీ కొంత మంది ఉద్యోగ సంఘ నేతల్ని అరెస్ట్ చేస్తే మిగతా వారు దారిలోకి వస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.